తెలంగాణలో నేటి నుంచి కాలేజీలు బంద్

- August 31, 2016 , by Maagulf
తెలంగాణలో నేటి నుంచి కాలేజీలు బంద్

తెలంగాణ ప్రభుత్వానికి, ప్రైవేటు విద్యాసంస్థల మ‌ధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. తనిఖీలను నిరసిస్తూ గతంలో బంద్‌ నిర్వహించిన ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు.. తాజాగా మరోసారి ఉద్యమ బాట పట్టాయి. తనిఖీలు నిలిపివేయాలని, ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గతంలో బంద్‌ చేపట్టిన విద్యా సంస్థలు.. పోటీపరీక్షలకు సెంటర్లు ఇచ్చేందుకు నిరాకరించాయి. ఆ తర్వాత ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇంత వరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈరోజ నుంచి మూడు రోజులపాటు బంద్‌ చేపట్టనున్నాయి.

ఇంజ‌నీరింగ్, డిగ్రీ కాలేజిల్లో ప్రమాణాలపై తనిఖీల విష‌యంలో మొదలైన వివాదం కొన్ని నెలలపాటు సీరియ‌స్‌గానే నడిచింది. అప్పట్లో నిరవధికంగా విద్యాసంస్థలు మూసివేసిన యాజ‌మ‌న్యాలు చివ‌ర‌కు పరీక్షలకు సెంటర్లు కూడా ఇవ్వకుండా సర్కార్‌ను ఇరకాటంలోకి నెట్టేశాయి. అయితే  ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. స్వయంగా ముఖ్యమంత్రే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. కానీ, రోజులు గడుస్తున్నా హామీలు అమలు జరగకపోవడంతో మళ్లీ ఆందోళన బాటకు సిద్ధమయ్యాయి.
ముఖ్యమంత్రి బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించినా, విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రైవేటు యాజమాన్యాలు మండిపడుతున్నాయి. భవిష్యత్‌ కార్యాచరణపై రెండు మూడు రోజులుగా చర్చించిన ప్రైవేటు కాలేజీలు మరోసారి బంద్‌ చేపట్టాలని నిర్ణయించాయి. ఫీజు బకాయిలు చెల్లించకుంటే తమ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, ఫ్యాకల్టీకి జీతాలు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నాయి. బకాయిలు చెల్లించడంతోపాటు ఆన్‌లైన్‌ డిగ్రీల్లో లోపాలను సరిదిద్దాలని, చివరి విడత అడ్మిషన్లకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాలు చేపడుతున్న ఈబంద్‌కు ఇంజినీరింగ్‌ కాలేజీలు మద్దతు తెలుపలేదు. ఇప్పటికే ఒక‌సారి విద్యాసంస్థల బంద్‌తో సమస్యలు ఎదుర్కొన్న ప్రభుత్వం.. ఈసారి ఎలా వ్యవహరిస్తుందన్నదే తెలియాల్సి ఉంది. ఈ నెల 9న నిర్వహించనున్న ఎంసెట్‌ త్రీ పరీక్ష ఎలా గట్టెక్కిస్తుందో చూడాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com