వేలాడే గాజు వంతెన పునఃప్రారంభం...

- September 28, 2016 , by Maagulf
వేలాడే గాజు వంతెన పునఃప్రారంభం...

గత కొన్ని రోజులుగా మూసివేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పొడవైన వేలాడే గాజు వంతెనను చైనా తిరిగి ప్రారంభించనుంది. అక్టోబర్‌లో చైనా గోల్డెన్ వీక్ హాలిడేని పురస్కరించుకుని సెప్టెంబర్ 30వ తేదీన ఈ గాజు వంతెనపై పర్యాటకులకు తిరిగి అనుమతించనుంది.చైనాలోని జాంగ్జియాంగ్జి అనే ప్రాంతంలో గ్రాండ్ కానియన్ సెనిక్ ప్రాంతంపై ఈ వంతెనను నిర్మించారు. యునెస్కో కూడా దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపునిచ్చింది. ఆగస్టు 20వ తేదీని దీనిని ప్రారంభించగా అనూహ్యంగా సందర్శకుల తాకిడి రోజుకు పదివేలకు పెరిగింది.
సూచనలు, హెచ్చరికలను ప్రవేశపెట్టిన బ్రిడ్జి కమిటీ
దీంతో వంతెనపై కొద్దిపాటి పగుళ్లు వచ్చాయి. దీంతో పలు మార్పులు, చేర్పులు చేశారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి రోజుకు 8000మంది పర్యాటకులకు అనుమతించేలా బ్రిడ్జి నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు సూచనలు, హెచ్చరికలను కూడా ప్రవేశపెట్టింది.
 వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి
ఈ గాజు వంతెనను వీక్షించాలనుకునే వారు ముందుగా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఇలా చేస్తే వారికి గుర్తింపు కార్డులను ఇస్తారు. తద్వారా స్వైప్ చేసి బ్రిడ్జిని చూసేందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు హై హీల్స్ వేసుకున్న పర్యాటకులకు అనుమతించడం లేదు.
 
బ్రిడ్జి ముందు మానిటరింగ్ సిస్టమ్‌
ఎలాంటి వ్యక్తిగత వస్తువులను కూడా ఈ వంతెనపైకి అనుమతించబోమని స్పష్టం చేశారు. బ్రిడ్జి ముందు మార్గంలో ఇంటెలిజెంట్ మానిటరింగ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. తద్వారా సందర్శకుల తాకిడిని కొంత మేరకు తగ్గించవచ్చని కమిటీ పేర్కొంది. డిజైన్, నిర్మాణంలో ఈ బ్రిడ్జి ప్రపంచంలో 10 అత్యుత్తమ రికార్డును సొంతం చేసుకుంది.
 
టీకెట్ ధర రూ. 1400
ఈ బ్రిడ్జిని వీక్షించేందుకు టీకెట్ ధరను 138 యాన్ ($21) నిర్ణయించారు. ఇక భారతీయ కరెన్సీలో రూ.1400 వరకు చెల్లించాల్సి ఉంటుంది. సుమారు నెల రోజులపాటు ఈ వంతెనను మూసి వేసిన అధికారులు కొన్ని సాంకేతిక పరమైన మార్పులు చేశారు. 430 మీటర్ల పొడవుతో ఆరు మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మించి దానిపై మూడు వేర్వేరు లేయర్లతో రూపొందించిన 99 దళసరి గాజు పలకలను అమర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com