ఉత్తర మయన్మార్‌ ఘర్షణల్లో 12మంది మృతి

- October 12, 2016 , by Maagulf
ఉత్తర మయన్మార్‌ ఘర్షణల్లో 12మంది మృతి

ఉత్తర మయన్మార్‌లోని రాఖినే రాష్ట్రంలో సాయుధ బలగాలు, సాయుధ గ్రూపు మధ్య జరిగిన ఘర్షణల్లో 12మంది మరణించారని ప్రభుత్వ మీడియా బుధవారం తెలిపింది. ప్రధానంగా రోహింగ్యా ముస్లిమ్‌ ప్రాబల్యం వుండే మాంగ్‌దా టౌన్‌షిప్‌లో మంగళవారం వందలాదిమంది వ్యక్తులు పిస్టళ్లు, కత్తులు ధరించి సైనిక బలగాలపై దాడులు చేయడంతో నలుగురు సైనికులు మరణించగా దాడి చేసిన వారు ఏడుగురు మరణించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్‌ న్యూ లైట్‌ ఆఫ్‌ మయన్మార్‌ పేర్కొంది. మరణించిన వారి దగ్గర కత్తులు, కర్రలు కూడా వున్నాయి. ఈ దాడులు జరిగిన ప్రాంతం బంగ్లాదేశ్‌ సరిహద్దుకు ఎంతో దూరంలో లేదు. మూడు సరిహద్దు పోస్ట్‌లపై ఆదివారం జరిగిన దాడిలో 9మంది పోలీసు అధికారులు మరణించడంతో సైన్యం అక్కడ రంగంలోకి దిగింది.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2012లో జరిగిన రోహింగ్యా హింసాకాండ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. ఆనాటి హింసాకాండలో వంద మందికి పైగా మృతి చెందారు. శరణార్ధ శిబిరాల్లో వేలాదిమంది తలదాచుకున్నారు. రోహింగ్యా ముస్లిమ్‌లను బంగ్లాదేశ్‌ నుండి వచ్చిన అక్రమ శరణార్ధులుగా బౌద్ధ జాతీయులు పరిగణిస్తారు.

వీరిలో చాలామందికి కొన్ని తరాల వెనుక మయన్మార్‌తో సంబంధాలున్నప్పటికీ వారిని ఇక్కడివారుగా ఒప్పుకోరు. కాగా ఈ సరిహద్దు దాడుల వెనుక గల ఆరుగురు అనుమానితుల్లో నలుగురిని మంగవారం పట్టుకున్నారు. కాగా సంయమనం పాటించాల్సిందిగా మయన్మార్‌లో ఐరాస ప్రత్యేక సలహాదారు విజరు నంబియార్‌ సైన్యానికి, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com