నటి, గాయని మడోన్నా సెబాస్టియన్‌...

- October 13, 2016 , by Maagulf
నటి, గాయని మడోన్నా సెబాస్టియన్‌...

సరిగమలే లోకంగా పెరిగిన ఓ యువతి.. వూహించని విధంగా నటిగా మారింది. అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. నటిగా ప్రేక్షకులను మెప్పించడంతో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చిన ప్రాణప్రదమైన సంగీతాన్ని మాత్రం వదిలేది లేదని చెప్పేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త పాటలతో శ్రోతలను అలరిస్తోంది.
మలయాళ 'ప్రేమమ్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమైన నటి, గాయని మడోన్నా సెబాస్టియన్‌. తెలుగు 'ప్రేమమ్‌'లో నాగచైతన్య సరసన నటించి ఇక్కడి యువతను మెప్పించింది మడోన్నా. మలయాళ 'ప్రేమమ్‌' ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన మడోన్నా..నటిగా తెరమీదకు రాకముందే గాయనిగా సంచలనాలు నమోదు చేసింది.మలయాళ సంగీత కార్యక్రమం మ్యూజిక్‌ మోజో ద్వారా మడోన్నా గాయనిగా కెరీర్‌ను ప్రారంభించింది. దీపక్‌దేవ్‌.. గోపీ సందర్‌ సంగీత దర్శకత్వంలో మడోన్నా పాడిన అనేక గీతాలు సంగీత ప్రియుల మదిలో నిలిచిపోయాయి. ఎంతో మంది సంగీత కళాకారుల్ని.. గాయకులను అందించిన కప్పా టీవీ కార్యక్రమాల ద్వారా కేరళ అంతటా మడోన్నా పాటలు మారుమోగాయి. గాయనిగానే కాకుండా నటిగా అనేక అవకాశాలు కల్పించాయి.సూర్య టీవీలో మడోన్నా చేస్తున్న ఓ కార్యక్రమం మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అప్పుడే మడోన్నాను ఎంపిక చేసుకున్నాడు. నటనపై కంటే సంగీతంపై ఆసక్తి ఉన్న మడోన్నా ఆ సినిమా అవకాశాన్ని కాదనుకుంది. ఆ పాత్రను వేరే వారితో చేయించడం ఇష్టం లేని దర్శకుడు పదే పదే అడగడంతో 'ప్రేమమ్‌' ద్వారా వెండి తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో మడోన్నా నటన అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.కేరళలో పుట్టిన మడోన్నా.. ఓమన్‌లోని సెయింట్‌ పీటర్స్‌ పాఠశాలలో చదువుకుంది. బెంగళూరులోని క్రైస్ట్‌ విశ్వవిద్యాలయం నుంచి బీకాం పూర్తి చేసింది. చిన్నతనం నుంచి సంగీతంపై ఉన్న ఆసక్తితో కర్ణాటక.. పాశ్చాత్య సంగీతంలో శిక్షణ తీసుకుంది. కప్పా టీవీలో ప్రసారమయ్యే మ్యూజిక్‌ మోజో ప్రోగ్రాం ద్వారా గాయనిగా మారింది.

2015లో రాబీ అబ్రహం సంగీత దర్శకత్వంలో 'యూ టూ బ్రూటస్‌' అనే చిత్రంలో మడోన్నా పాడిన రావుకలి పాట గాయనిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అనతికాలంలోనే ఈ ఇద్దరూ 'ఎవరాప్టర్‌' అనే మ్యూజిక్‌ బ్యాండ్‌కు శ్రీకారం చుట్టారు. 2016 జనవరిలో విడుదల చేసిన తొలి మ్యూజిక్‌ వీడియో 'వెరుత్తే'కు సంగీత అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది మడోన్నా. చిన్నతనం నుంచి సంగీతాన్ని జీవితంలో ఓ భాగం చేసుకున్న ఈమె.. నటిగా ఎంత బిజీగా ఉన్నా పాటలు పాడటం మాత్రం ఆపలేదు. తొలి ప్రాధాన్యత సంగీతానికే ఇస్తోంది.
ఇటీవలే దుబాయ్‌ రేడియో స్టేషన్‌ కోసం దీపక్‌ దేవ్‌ స్వరపరిచిన జింగిల్స్‌ను మడోన్నా ఆలపించింది. అక్కడ కూడా మంచి గాయనిగా మరింత పేరు సంపాదించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com