నిజమైన దొంగ

- August 20, 2015 , by Maagulf
నిజమైన దొంగ

ఆ ఊరిలో రాజయ్యా, సుబ్బయ్య మంచి స్నేహితులు. రాజయ్య గుణంలో మంచివాడు. సుబ్బయ్య స్వార్ధపరుడు. లోభి గుణం గలవాడు. ఒకరోజు రాజయ్య ఊరికి వెళుతూ తన ఇంట్లోని కొంత బంగారాన్ని, అత్యంత విలువైన ఒక వజ్రాన్ని సుబ్బయ్యకి ఇచ్చి నేను ఊరి నుంచి రాగానే తీసుకుంటాను జాగ్రత్తగా ఉంచు అని చెప్పి వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత రాజయ్య ఊరి నుంచి తిరిగివచ్చి సుబ్బయ్య ఇంటికి వెళ్లి పిచ్చా,మాటీ మాట్లాడుతూ, మధ్యలో 'సుబ్బయ్యా నేను నీ దగ్గర దాచి ఉంచిన బంగారం వజ్రం తెచ్చి ఇవ్వు ' అని అడిగాడు. అందుకు సుబ్బయ్య లోపలికి వెళ్లి బంగారం మాత్రమే తెచ్చి రాజయ్య చేతిలో పెట్టాడు. అది చూసిన రాజయ్య, ఏంటీ సుబ్బయ్య ఇందులో వజ్రం లేదు అని అడిగాడు. అందుకు సుబ్బయ్య అదేంటి రాజయ్య నిన్ననే కదా నా ముగ్గురు స్నేహితుల సమక్షంలో నీకు నేను ఆ వజ్రాన్ని ఇచ్చేశాను అన్నాడు. గుండె గుభేలుమన్న రాజయ్య, సుబ్బయ్యతో మెల్లగా గొడవకు దిగాడు. ఆ గొడవ పెద్దదయ్యి ఆ ఊరి రాజు దగ్గరకు వెళ్లింది. రాజుగారు ఇద్దరినీ సముదాయించి ఈ చర్చని తన మంత్రికి అప్పగించాడు. మంత్రి సుబ్బయ్య సూచించిన ముగ్గురు స్నేహితులను విడి విడిగా పిలిచి నువ్వు చూశావా ఆ వజ్రం అని అడిగాడు. ఆ చూశాను మంత్రివర్యా మా సమక్షంలోనే ఆ వజ్రాన్ని రాజయ్యకిచ్చాడు సుబ్బయ్య అని సెలవిచ్చారు. అది విన్న మంత్రి అయితే ఇప్పుడు మీరు వెళ్లి రేపు రండి. వచ్చేటప్పుడు ఆ వజ్రం ఎంత పరిమాణంలో ఉందో ఇంచుమించుగా అంతే పరిమాణంలో ఉండేలా ఒక్కొక్క రాయి తీసుకురండి అన్నాడు. మరునాడు ముగ్గురు వ్యక్తులు మూడు రాళ్లు తీసుకువచ్చారు. ఒక్కొక్కటి ఒక్కో పరిమాణంలో ఉన్నాయి. నిలదీసి అడగ్గా నిజం బయటకు వచ్చింది. దాంతో సుబ్బయ్య దొంగతనం బయటపడింది. రాజయ్యకు న్యాయం జరిగింది. మిగిలిన వారికి తగిన శిక్ష విధించాడు రాజు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com