ఈ దీపావళి సైనికులకు అంకితం ..

- October 30, 2016 , by Maagulf
ఈ దీపావళి సైనికులకు అంకితం ..

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నూర్‌ జిల్లాలోని ఐటీబీపీ జవాన్లను ఆయన కలిశారు. సైనిక సిబ్బంది మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ సైనికులకు మిఠాయిలు తినిపించారు. వారితో కలిసి దిగిన కొన్ని ఫొటోలను ప్రధాని మోదీ 'జై జవాన్‌.. జై హింద్‌'.. అంటూ ట్విట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేశారు. దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లతో మోదీ దీపావళి సంబరాలు జరుపుకోవడం తొలిసారి కాదు. గత రెండు దీపావళి వేడుకలను ఆయన సైనికులతోనే జరుపుకొన్నారు.'కుటుంబంతో పండగ జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. దీపావళి వేడుక కోసం నేను మీ దగ్గరకు వచ్చా. 2001లో గుజరాత్‌ భూకంప బాధితులతో దీపావళి వేడుకలు జరుపుకొన్నా. అవసరమైనప్పుడల్లా మన జవాన్లు ధైర్య సాహసాలు ప్రదర్శించారు. జవాన్లకు మద్దతుగా కోట్లాది మంది దీపాలు వెలిగిస్తున్నారు. సినీనటులు, క్రీడాకారులు సహా అందరూ జవాన్లకు సందేశాలు పంపారు' అని సైనికులతో మోదీ అన్నారు. ప్రధాని అభ్యర్థిగా తన తొలి బహిరంగ సభలోనే ఒకే ర్యాంక్‌ ఒకే వేతనంపై హామీ ఇచ్చానని వెల్లడించారు.ఆదివారం ఉదయం ఆల్‌ ఇండియా రేడియో మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ఏడాది దీపావళిని జవాన్లకు అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 'గత కొన్ని నెలలుగా మన దేశ జవాన్లు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. వారి పేరు మీద మనం ఈ ఏడాది దీపావళి చేసుకోవాలని' ఆయన మన్‌కీ బాత్‌లో అన్నారు. ప్రతి పౌరుడు సైనికులను చూసి గర్వపడాలని ఆయన పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా స్వయానా మోదీ నేతృత్వంలోనే సందేశ్‌ 2 సోల్జర్స్‌ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. సైన్యాన్ని కీర్తిస్తూ పలువురు చేసిన సందేశాలను ఆయన రీట్వీట్‌ కూడా చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com