''నరుడా డోనరుడా' నవంబర్ 4 విడుదల...

- November 01, 2016 , by Maagulf
''నరుడా డోనరుడా' నవంబర్ 4  విడుదల...

'నరుడా డోనరుడా' చిత్రం కెరీర్‌ పరంగా తనకెంతగానో ఉపయోగపడుతుందన్న నమ్మకాన్ని హీరో సుమంత్‌ వ్యక్తంచేశారు. ఆయన కథానాయకుడిగా మల్లిక్‌రామ్‌ దర్శకత్వంలో అన్నపూర్ణా స్టూడియోస్‌ సమర్పణలో రమా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేషన్స్‌ పతాకాలపై వై.సుప్రియ, సుధీర్‌ పూదోట నిర్మించిన ఈ చిత్రం శుక్రవారంనాడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారంనాడు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో సుమంత్‌ మాట్లాడుతూ, 'తాతయ్య చివరిరోజుల్లో హిందీలో రూపొందిన విక్కీడోనర్‌ సినిమాను చూసి ఇలాంటి కొత్తరకమైన కథాంశాలు మన తెలుగులో కూడా వస్తే ఎంతో బావుంటుందని అన్నారు.

ఆయన స్పందన చూసి నా వద్దకు సినిమాలు చేయాలని వచ్చే దర్శకులకు విక్కీడోనర్‌ లాంటి కథతో సినిమా చేయాలనుందని చెప్పి చాలా కథలు విన్నాను. అయితే చివరకు విక్కీడోనర్‌నే రీమేక్‌ చేయాలనుకున్నాం. లోగడ గోల్కొండ హైస్కూల్‌, ఊహలు గుసగుసలాడే చిత్రాలకు సహకార దర్శకుడిగా పనిచేసిన మల్లిక్‌రామ్‌ పేరును నిర్మాత రామ్మోహనరావు సూచించారు. చాలా పరిమితమైన బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. క్షణం సినిమాకు పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు కూడా పనిచేశారు. మేము అనుకున్నట్లుగానే సినిమా చాలాబాగా వచ్చింది. కొత్తరకంగా ఉంటూ ఎవరినీ నిరాశపరచనివిధంగా ఈ చిత్రం ఉంటుంది' అని అన్నారు. దర్శకుడు మల్లిక్‌రామ్‌ మాట్లాడుతూ, 'ఇలాంటి కథాంశాన్ని తెరకెక్కించడం మొదట్నుంచీ నాకు ఎలాంటి రిస్క్‌ అనిపించలేదు. పన్నెండేళ్లుగా దర్శకత్వశాఖలో పనిచేసిన అనుభవమే అందుకు కారణం. అలాగే ఈ కథలో వినోదం ఉంటే మరింత బాగా పండుతుందన్న ఉద్దేశ్యంతో దానిని ప్రధానాంశంగా చేసుకున్నాం. స్క్రీన్‌ప్లేకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి చేసిన చిత్రమిది' అని అన్నారు. నిర్మాతలలో ఒకరైన జాన్‌సుధీర్‌ పూదోట మాట్లాడుతూ, 'కొంత గ్యాప్‌ తర్వాత సుమంత్‌ చేసిన చిత్రమిది. వాస్తవానికి ఇలాంటి కథాంశంతో సినిమా చేసేందుకు ఎంతో ధైర్యం ఉండాలి. తనే దగ్గరుండి అందరికీ నచ్చేలా ఈ స్క్రిప్ట్‌ను రాయించుకున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రంలోని పాత్రలో సుమంత్‌ నటన చూస్తే భవిష్యత్‌లో అతను ఎలాంటి పాత్రనైనా చేయగలరని అంటారు' అని పేర్కొనగా, మరో నిర్మాత వై.సుప్రియ మాట్లాడుతూ, విభిన్నమైన ఈ కథాంశాన్ని తెరకెక్కించిన తీరు ఎంతో బావుందని, 20 ఏళ్ళలో ఇలాంటి సబ్జెక్ట్‌తో సినిమా రాలేదని అన్నారు. నటుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో ఆంజనేయులు అనే ఓ మంచి పాత్ర చేశాను. హీరో పాత్ర కు సమానంగా ఉండే పాత్ర అది. ఈ చిత్రం కోసం టీమ్‌ పడుతున్న కష్టం చూసి ఒకప్పుడు తాను నటించిన లేడీస్‌ టైలర్‌ చిత్రం గుర్తుకొచ్చింది. హిందీలో జాతీయ అవార్డ్‌ వచ్చిన అన్నుకపూర్‌ పాత్రను తెలుగులో నేను పోషించాను' అని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో శ్రీలక్ష్మి, సుమన్‌శెట్టి, భద్రమ్‌, జబర్‌దస్త్‌ శేషు, సుంకర లక్ష్మి, పుష్ప, చలపతిరాజు తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: శ్రీరణ్‌ పాకాల, కెమెరా: షానియల్‌ డియో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com