లతా కు సుప్రీంకోర్టు నోటీసు జారీ

- December 01, 2016 , by Maagulf
లతా కు సుప్రీంకోర్టు నోటీసు జారీ

 'కొచ్చాడయాన్' చిత్రం బకాయిల చెల్లింపు కేసులో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. చెన్నైకి చెందిన 'యాడ్‌బ్యూరో' సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు లతా రజనీకాంత్‌కు నోటీసులను సిబ్బంది నేరుగా వెళ్లి అందించాలని ఆదేశించింది.ఈ కేసుకు సంబంధించి లతా రజనీకాంత్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసినా అవన్నీ తిరిగి వచ్చేయటంతో సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కోచ్చడయాన్ చిత్రం వల్ల నష్టాలు ఎదురైతే తగు పరిహారం చెల్లిస్తానని లతా రజనీకాంత్ తమకు హామీ ఇచ్చారని, ఆ చిత్రం ఆశించినమేరకు విజయం సాధించకపోవడంతో తమకు భారీగా నష్టాలు వచ్చాయని, కనుక మాట ప్రకారం పరిహారం చెల్లించాలని యాడ్‌బ్యూరో సంస్థ గతంలో హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసుపై లతా రజనీకాంత్ స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ యాడ్‌బ్యూరో సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.సుప్రీంకోర్టు నాలుగుసార్లు బెంగుళూరు చిరునామాకు పంపిన నోటీసులు చిరునామా దారురాలు లేరంటూ తిరిగొచ్చాయి. శుక్రవారం కేసు విచారణకు రాగా లతా రజనీకాంత్‌కు కోర్టు సిబ్బంది ఒకరు స్వయంగా నోటీసులను అందించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. నాలుగు వారాల్లో లతా రజనీకాంత్ కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆ నోటీసులో ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 13వ తేదీకి వాయిదా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com