షరియా కోర్టులను మద్రాస్ హైకోర్టు నిషేధించింది..
- December 19, 2016
తమిళనాడులో మశీదు ప్రాంగణాల్లో ఉన్న షరియా కోర్టులను మద్రాస్ హైకోర్టు నిషేధించింది. మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనలు చేయడానికి ఉపయోగించే ప్రదేశాలు కేవలం మతపరమైన ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం సుందర్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. షరియా కోర్టులు కార్యకలాపాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా వీటిపై నెలలోగా యథార్థ పరిస్థితులను వివరిస్తూ నివేదికను సమర్పించాలని పేర్కొంది. ప్రవాస భారతీయుడు అబ్దుల్ రహమాన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మద్రాస్ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.
చెన్నైలోని ఓ మశీదు నుంచి షరియా కోర్టు రెగ్యులర్ కోర్టు మాదిరిగానే పని చేస్తోందని, వివాదాలకు సంబంధించిన కక్షిదారులకు సమన్లు జారీ చేస్తోందని, విడాకులు మంజూరు చేస్తోందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఏ సిరాజుద్దీన్ తన వాదనలు వినిపిస్తూ అనేకమంది అమాయక ముస్లింల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ పిల్ను దాఖలు చేసినట్లు తెలిపారు. మక్కా మశీదు షరియా కౌన్సిల్, రాష్ట్రంలో ఉన్న ఈ తరహా ఫోరంల వల్ల ముస్లింలు మౌనంగా ఆవేదనను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. వందలాది ముస్లిం కుటుంబాలు ఈ వ్యవస్థ వల్ల ప్రభావితమవుతున్నాయని తెలిపారు.
తమ కోర్టు షరియా చట్టం ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దాని ఆదేశాలు, తీర్పులు మతపరంగా ముస్లింలను కట్టుబడి ఉండేలా, విధేయత చూపేలా చేయగలుగుతాయనే ముద్రను ఈ షరియా కోర్టులు ముస్లింలలో ఏర్పరుస్తున్నాయని చెప్పారు. తాను కూడా ఈ విధానం వల్ల బాధితుడిగా మారిపోయానన్నారు. తన భార్యతో తిరిగి కలవడానికి తాను ప్రయత్నించానని, అయితే షరియా కోర్టు బలవంతంగా తన చేత విడాకుల (తలాక్) లేఖపై సంతకం చేయించిందని, విడాకులు మంజూరైనట్లు ప్రకటించిందని వివరించారు.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









