ఫారిన్‌ సంస్థలు సానుకూలం ఏపీకి వచ్చేందుకు...

- January 18, 2017 , by Maagulf
ఫారిన్‌ సంస్థలు సానుకూలం ఏపీకి వచ్చేందుకు...

పెట్టుబడుల చర్చలు ఫలితాన్నిస్తున్నాయి.. ఏపీ ముఖ్యమంత్రి ఫారిన్‌ ట్రిప్‌లో పెట్టుబడుల వర్షం కురుస్తోంది. ఏపీకి వచ్చేందుకు ఫారిన్‌ కంపెనీలు క్యూ కడుతున్నాయి. దావోస్‌ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో సంపద సృష్టి, ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్‌ పర్యటన దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వందల మంది సీఈవోలను ఒకేసారి కలిసే అవకాశం ఉన్నందునే దావోస్‌కు వస్తున్నట్లు తెలిపారు. దావోస్‌ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న సీఎం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. సీఐఐ సీఈవో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమన్నారు చంద్రబాబు. ఏపీలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కోర్‌ డ్యాష్‌బోర్డ్‌పై పారిశ్రామికవేత్తలు ప్రశంసల జల్లు కురిపించారు. రౌండ్‌టేబుల్‌ సమావేశం చివరల్లో డ్యాష్‌ బోర్డు గురించి ముఖ్యమంత్రే స్వయంగా పరిచయం చేశారు. పనితీరును అందరికీ వివరించారు. ఇక ముఖ్యమంత్రితో పలువురు పారిశ్రామికవేత్తలు సమావేశమయ్యారు. ఇక ఏపీలో నంద్‌ ఘర్‌ పేరుతో వంద విద్యాలయాలు నెలకొల్పనున్నట్లు వేదాంత రెసోర్సెస్‌ ప్రకటించింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను సంస్థ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సైలాన్స్‌ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. సంస్థ ప్రెసిడెంట్‌ ఫెలిక్స్‌ మార్కవర్డ్‌ చంద్రబాబుతో చర్చలు జరిపారు. బ్రిక్స్‌ బ్యాంక్‌ చైర్మన్‌ కేవీ కామత్‌ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. త్వరలో ఏపీకి ఒక బృందాన్ని పంపిస్తానని  తెలిపారు. ఈ సందర్భంగా చైనా పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు సహకరించాలని కామత్‌ను సీఎం కోరారు.
రాష్ట్రంలో సైన్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఎంటీఐపీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే పదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పన, 100 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ లక్ష్యంగా పెట్టుకుంది. వైద్య రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని ఎంటీఐపీ చైర్మన్‌ ఫెలిక్స్‌ గ్రిసార్డ్‌ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. 2017-18 నాటికి ఫేజ్‌-1ఏ, 2019 నాటికి ఫేజ్‌ 1బీ సిద్ధం చేస్తామని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. పూర్తిస్థాయిలో రోడ్‌ మ్యాప్‌తో రావాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com