హైదరాబాద్ ఇంజనీర్ మిస్సింగ్ టాంజానియాలో...
- January 27, 2017
హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన ఓ ఇంజనీర్ టాంజానియాలో అదృశ్యమైన కేసులో పురోగతి లభించింది. విక్టోరియా సమీపంలో ఉన్న ఓ సరస్సులో స్విమ్మింగ్ కోసం వెళ్లి గల్లంతైపోయాడు. ఇండియన్ హైకమిషన్ ఆదేశాల మేరకు అక్కడి ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మురం చేయగా.. సదరు ఇంజనీర్ మిస్సింగ్ మిస్టరీ వీడింది.
అదృశ్యమైన వ్యక్తిని 35ఏళ్ల అలుగుబెల్లి జనార్ధన్ రెడ్డిగా గుర్తించారు. టాంజానియాలోని గీటా గోల్డ్ మైన్స్ లో అతను ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం టాంజానియా వెళ్లిన అతను కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు.
ఘటన జరిగిన జనవరి 21వ తేదీ జనార్దన్, అతని ఉద్యోగ సహచరులతో కలిసి రుబోండో ఐస్ లాండ్ లో ఉన్న సరస్సు వద్దకు వెళ్లాడు.
'అక్కడికెళ్లాక.. స్విమ్మింగ్ కోసం ముగ్గురు సరస్సులో దూకారు. ముందు సహచర ఉద్యోగులు సరస్సులో దూకగా.. చివరగా జనార్దన్ అందులో దూకాడు. జనార్థన్ దూకిన వెంటనే ఒక్కసారిగా బురద మొత్తం పైకి ఎగజిమ్మింది. ఆ తర్వాత 'నో' అని జనార్దన్ పెద్దగా అరవడం వినిపించింది. అంతే.. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం'
'దీన్నిబట్టి సరస్సులో మొసళ్లు ఉన్నాయన్న సంగతి తెలిసింది. ఇప్పటికైతే జనార్దన్ రెడ్డి గురించి ఎలాంటి సమాచారం లేదు. గజ ఈతగాళ్లతో సరస్సులో జనార్దన్ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి' అని తెలంగాణ సచివాలయ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.
జనార్దన్ రెడ్డి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాల్సిందిగా కోరుతూ అతని తండ్రి రాఘవ రెడ్డి హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జను సంప్రదించారు. కొడుకు అదృశ్యమయ్యాడన్న వార్త తెలియగానే.. తొలుత జనార్దన్ పనిచేస్తున్న కంపెనీకి ఫోన్ చేసి సహాయం చేయాల్సిందిగా రాఘవరెడ్డి కోరారు. అయితే కంపెనీ నుంచి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
'తెలంగాణ ప్రభుత్వాన్ని నేను అర్థిస్తున్నాను. టాంజానియా అధికారులతో సంప్రదింపులు జరిపి గాలింపు చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా కోరుతున్నాను' అని రాఘవరెడ్డి వెల్లడించారు. మంత్రి కేటీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా ఆయన విదేశాంగ సహాయం కోరారు.
కాగా, జనార్దన్ రెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి. గచ్చిబౌలిలోని ఖాజాగూడాలో వారు ప్రస్తుతం నివాసముంటున్నారు. సహచరులతో కలిసి బయటకు వెళ్లే గంట ముందు చివరిసారిగా జనార్దన్ రెడ్డి తన తండ్రికి ఫోన్ చేశారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు సరస్సులో మునిగిపోవడంతో.. అతని ఆచూకీ కోసం ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







