లైంగిక నేరగాళ్ళ వివరాలు అందరికీ తెలిసేలా కేరళలో కొత్త చట్టం
- February 23, 2017
మహిళలపై నేరాలు పెరుగుతున్నాయనే ఆందోళన తీవ్రమవుతోంది. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చట్టాలను పటిష్ఠపరచడం, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు కేరళ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. దేశంలోనే తొలిసారిగా లైంగిక నేరగాళ్ళ జాబితాను తయారు చేసి, వారి వివరాలు అందరికీ తెలిసేలా చేయబోతోంది. గవర్నర్ జస్టిస్ (విశ్రాంత) పి సదాశివం గురువారం శాసనసభలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. కేరళలో మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు చేపడుతున్న చర్యలను జస్టిస్ సదాశివం వివరిస్తూ సెక్స్ నేరగాళ్ళకు సంబంధించిన గుర్తింపు వివరాలతో రిజిస్టర్ను తయారు చేస్తామన్నారు.
దానిని అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇటువంటి చర్య దేశంలోనే మొదటిదని తెలిపారు. లైంగిక నేరాల బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు నిధిని ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. సాంఘిక న్యాయ శాఖ ఆధ్వర్యంలోని నిర్భయ కేంద్రం పనితీరు బాగున్నప్పటికీ, బాధితులకు సాయం చేసేందుకు సమగ్ర నిధి లేదని తెలిపారు.
కొందరు బాధితులు ఆర్థిక సాయాన్ని పొందుతున్నప్పటికీ, వారు అనుభవించిన నష్టానికి తగిన పరిహారం అందడంలో జాప్యం జరుగుతుండటానికి కారణం నిధి లేకపోవడమేనని వివరించారు. సెక్స్ నేరాలు పెరుగుతుండటానికి కారణం సమాజపరమైన నిరోధం లేకపోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాలూకా స్థాయిలో అందరూ మహిళలే ఉండే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముందుగా ప్రకటించిన తేదీన ప్రతి పంచాయతీకి పోలీసు అధికారిణి తప్పనిసరిగా వెళ్ళేవిధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







