ఏ.పి సీఎంను పొగడ్తలతో ముంచెత్తిన గవర్నర్

- March 06, 2017 , by Maagulf
ఏ.పి సీఎంను పొగడ్తలతో ముంచెత్తిన గవర్నర్

అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలను, పట్టిసీమకు రికార్డు సమయంలో పూర్తి చేశారని గవర్నర్‌ నరసింహన్ సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని, తక్కువ కాలంలో అసెంబ్లీ భవనం నిర్మితమైందని వ్యాఖ్యానించారు. త్వరలో పోలవరం గ్రావిటి ద్వారా నీటి సరఫరా చేస్తామన్నారు. రెండంకెల వృద్ధిరేటు సాధించిన మొదటి రాష్ట్రం ఏపీనేనని గవర్నర్‌ అభినందించారు. 2022 నాటికి దేశంలో ఏపీని అగ్రగామిగా నిలుపుతామని, ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో ఏపీ ముందుకెళ్తోందని చెప్పారు. నాబార్డు ద్వారా పోలవరానికి సాయం చేస్తున్న కేంద్రానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి, నిర్ణీత సమయంలో తోటపల్లి, గండికోట ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వెలుగొండ సహా పలు ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. విభజనతో ఏర్పడ్డ సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకున్నామని, తక్కువ వర్షపాతం ఉన్నా వ్యవసాయంలో వృద్ధి సాధించామని గవర్నర్ పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో ఎన్నో విజయాలు సాధించామని, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశామన్నారు.

పారిశ్రామిక వృద్ధిరేటు 9.58 శాతంగా నమోదైందని, ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆదాయం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. ఏపీని ఆక్వా హబ్‌గా మారుస్తామని నరసింహన్ భరోసా ఇచ్చారు. అడవుల విస్తీర్ణం పెంచేందుకు పల్లె వనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రైతులకు రాయితీపై యంత్రాల సరఫరా చేస్తామని, రైతులకు 50 శాతం రాయితీతో పశుగ్రాసం అందిస్తామని గవర్నర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com