మరోసారి జడలువిప్పిన జాత్యహంకారం అమెరికాలో

- March 26, 2017 , by Maagulf
మరోసారి జడలువిప్పిన జాత్యహంకారం అమెరికాలో

అమెరికాలో మరోసారి జాత్యహంకారం జడలు విప్పింది..ఈ సారీ జాత్యహంకారి విద్వేషానికి ఓ సిక్కు మహిళ లక్ష్యంగా మారింది. న్యూయార్క్‌లో సబ్ వే రైల్లో ఉన్న ఒంటరి యువతిని నీ దేశానికి వెళ్లిపో అని హుంకరించాడు ఓ అమెరికన్‌. ఈ జాతివిద్వేష వ్యాఖ్యలను ఆ యవతి కాస్త ఆలస్యంగా ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. దుండగుడు తనను దూషించిన విషయాన్ని వీడియోతో సహా విడుదల చేసింది.. రైలెక్కిన క్షణం నుంచీ ఏం జరిగిందో ఆ వీడియోలో స్వయంగా వివరించింది. ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్లేందుకు రాజ్‌ప్రీత్‌ హైర్‌ మన్‌హట్టన్‌ వైపు వెళ్లే సబ్‌వే రైలు ఎక్కింది. ఫోన్లో చూసుకుంటూ నిల్చుంది. అదే సమయంలో రైల్లో ఆమె వెనుకే నిల్చున్న అమెరికన్ దేశం విడిచి వెళ్లాలంటూ యువతిపై పెద్దగా కేకలు వేశాడు. యువతిని మిడిలీస్ట్‌కు చెందినదిగా భావించిన  శ్వేత జాతీయుడు.. నీది ఈ దేశం కాదు.. మీ లెబనాన్‌కు వెళ్లిపో అంటూ తీవ్రంగా తిట్టాడు. 
ఈ ఘటనను న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించే దిస్‌ వీక్‌ ఇన్‌ హేట్‌లో యువతి  వివరించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైనప్పటి నుంచి అమెరికాలో జరుగుతున్న జాతి విద్వేష దాడులపై పత్రిక.. దిస్ వీక్ ఇన్ హేట్ అనే విభాగాన్ని నిర్వహిస్తోంది. తను లెబనాన్‌కు చెందినదాన్నని ఆ వ్యక్తి తనను దూషించాడని.. కానీ తను దానికి చాలా దూరంలో ఉన్న ఇండియానాలోని ఓ సిటీలో జన్మించానని రాజ్ ప్రీత్ హైర్ ఈ వీడియోలో చెప్పింది. అయితే ఆ రెండు పేర్లు ఒకేలా ఉండటంతో దుండగుడు తనను తిట్టాడేమోనని పేర్కొంది. ఈ ఘటన తర్వాత ఇద్దరు మహిళలు తనకు ధైర్యం చెప్పారన్న యువతి.. మరో మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొంది. మరోవైపు అమెరికాలో జాతి విద్వేషానికి వ్యతిరేకంగా ఇండో అమెరికన్లు పోరాడుతూనే ఉన్నారు. జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఇది మా దేశం.. మేం ఇక్కడ నివసించడానికే వచ్చాం అంటూ నినాదాలు చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో ఈ దేశంలో మా హక్కులను డిమాండ్‌ చేస్తూనే ఉంటాం అని ప్రకటించారు. విద్వేష దాడులకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ చేశారు. ఇటు తరచూ జాత్యహంకార ఘటనలు బయటపడుతుండడంతో అగ్రరాజ్యంలో ఉన్న భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com