భారత్‌ సర్కార్ కు ట్రంప్‌ హెచ్చరిక అక్రమ వలసదారులు ఇంటికే

- March 26, 2017 , by Maagulf
భారత్‌ సర్కార్ కు ట్రంప్‌  హెచ్చరిక  అక్రమ వలసదారులు ఇంటికే

అక్రమ వలసలపై ట్రంప్ సర్కార్‌ టాప్ గేర్‌లో వెళుతోంది. చట్ట విరుద్ధంగా నివాసం ఉంటున్న వారిని ఇంటికి పంపే కార్యక్రమం మొదలుపెట్టింది. ఆ జాబితాలో మనవాళ్లూ ఉన్నారు. భారత్ సర్కార్‌కు ఆ జాబితాను కూడా పంపించింది.  
ఎన్ని విమర్శలొచ్చినా .. ఎవరేమన్నా  ట్రంప్ అనుకున్నది చేస్తున్నారు. అక్రమ వలసలను దేశం నుంచి వెళ్లగొట్టే పనికి శ్రీకారం చుట్టారు. 270 మందికి పైగా భారతీయులను తిప్పిపంపనుంది. దీనిపై ఇప్పటికే మన సర్కార్  సమాచారం అందింది.  ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పార్లమెంట్‌కు చెప్పారు. ట్రంప్‌ ప్రభుత్వం ఏ అధారాలతో ఈ జాబితా రూపొందించారన్న సమాచారం మాత్రం ఇవ్వలేదు. అందుకే అక్రమవలసదారులుగా అమెరికా చెబుతున్న వారి పేర్లు, వివరాలు తమకు తెలియజేయాలని భారత్‌ కోరింది. జాతీయతను పరిశీలించకుండా... ఆ జాబితాలో ఉన్న వారంతా భారతీయులూనని  ఎలా నమ్ముతామని సుష్మా స్వరాజ్ అన్నారు.  మనవాళ్లని నిర్ధారణ అయ్యాకే దేశంలోకి అనుమతించేందుకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు జారీచేస్తామని చెప్పారు. మరోవైపు, అమెరికా వీసా స్ర్కూటినీ మరింత కట్టుదిట్టం చేశారు. మామూలుగానే అత్యంత కఠినంగా ఉండే అమెరికన్‌ వీసా ప్రాసెస్‌.. ఇకపై మరింత క్లిష్టంగా మారనుంది. పర్యాటక వీసాపైనో, వ్యాపార వీసాపైనో అమెరికా వెళ్లాలనుకునేవారు చాలా వివరాలు చెప్పాల్సి వుంటుంది. గత 15 ఏళ్లుగా ఎక్కడ నివాసం ఉంటున్నాం, ఏ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు వంటి వివరాలన్నీ సమర్పించాలి. వీటికి తగిన డాక్యుమెంట్లను పొందుపరచాల్సివుంటుంది. అలాగే గత ఐదేళ్లుగా వారు  వాడిన ఫోన్‌ నంబర్ల వివరాలూ తెలపాల్సివుంటుంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ నుంచి అన్ని దేశాల్లోని అమెరికా  వీసా కార్యాలయాలకూ ఫాక్స్‌లు అందాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com