భారతదేశం లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

- April 20, 2017 , by Maagulf
భారతదేశం లో  రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

ఎండలు బాబోయ్‌ ఎండలు... మాడు పగలగొడుతున్నాయి... ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి... ప్రాణాలు తోడేస్తున్నాయి.... సూర్యుడు పై నుంచి భగ భగ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం పదిగంటల తర్వాత రోడ్డుపైకి వస్తే సుర్రు సుమ్మైపోతోంది. మార్చిలోనే ఎండలు విజృంభించాయి. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనాలు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం పది తర్వాత రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో ఉష్ణోగ్రతలు రికార్డుల మోత మోగిస్తోంది. బిరాలో అత్యధికంగా 47 డిగ్రీల టెంపరేచర్‌ టచ్‌ అయ్యింది. అకోలాలో 44 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది. అలాగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, యూపీ, హర్యానా, ఛండీగర్‌, ఒడిశాలలో పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇక ఎండకు తోడు ఉక్కపోత, వేడిగాలులు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్య ప్రతాపం కనిపిస్తోంది. 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురంలలో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. భానుడి భగభగలకు భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి వణికిపోతున్నారు. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందంటున్నారు. ఆ తర్వాత కూడా 40 డిగ్రీల టెంపరేచర్‌ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ తర్వాత గాలుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఏటా సాధారణంగా మార్చి నెలలో ఎండల ప్రభావం అంతగా ఉండదు. కాని ఈసారి మాత్రం ముందుగానే దంచికొడుతున్నాయి. ఇది గ్లోబల్‌ వార్మింగ్‌కు సంకేతాలంటున్నారు IMD అధికారులు. ఎండల దెబ్బకు మనుషులే కాదు జంతవులు అల్లాడిపోతున్నాయి. అడవుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నీళ్లులేక జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. జింకలు, ఏనుగులు, నెమళ్లు రోడ్లపై కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఊళ్లపైకి వస్తున్నాయి. హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్క్‌లో నెమళ్లు కూడా రోడ్డుపై హల్‌చల్‌ చేస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక జూలలో ఉండే జంతువుల పరిస్థితి అంతే. అయితే సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో... కొంత ఉపశమనం కలుగుతోంది. ప్రకాశం జిల్లాపై ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వారం రోజులుగా జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేనంతంగా ఈ ఏడాది 40 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్‌ టచ్‌ అవుతోంది. ఎండ దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం పదిగంటల తర్వాత ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే జనాలు వణికిపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com