తెలంగాణలో సీఎం కెసిఆర్, ఒంటరి మహిళలకు ఆసరా పథకం అమలు

- June 05, 2017 , by Maagulf
తెలంగాణలో సీఎం కెసిఆర్, ఒంటరి మహిళలకు ఆసరా పథకం అమలు

తెలంగాణలో ఒంటరి మహిళలకు ఆసరా పథకం అమలు చేస్తున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో లబ్దిదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను ప్రజాప్రతినిధులు అందించారు. అన్ని జిల్లాలోనూ మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం లక్షా 35 వేల మందిని ఈ పథకంలో లబ్దిదారులుగా గుర్తించారు. దీంతో ఆసరా పథకంలో పెన్షన్లు తీసుకుంటున్నవారి సంఖ్య తెలంగాణలో 38 లక్షలకు చేరింది. ఒంటరి మహిళలకు పెన్షన్ పథకం చరిత్రాత్మకమన్నారు మంత్రులు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం  దేశానికే ఆదర్శమన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని చెప్పారు. 
మహబూబ్ నగర్ లో ఒంటరి మహిళలకు పెన్షన్ పంపిణి అందరినీ భావోద్వేగాలకు గురిచేసింది. అక్కడికి తరలివచ్చిన లబ్దిదారులను చూసి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చలించిపోయారు. తన నియోజకవర్గంలో ఇంత మంది ఒంటరి మహిళలు ఉన్నారా అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఎమ్మెల్యేను చూసి మహిళలు కూడా కన్నీరు కార్చారు. పెన్షన్లు ఇస్తున్నామన్న సంతోషం కన్నా, ఇంతమంది మహిళలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారా అని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఒంటరి మహిళల పింఛన్‌ పథకానికి అన్నివర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుములలో లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేసిన సీఎల్పీ లీడర్. జానారెడ్డి..ఈ పథకం బాగుందని కితాబిచ్చారు. అయితే ప్రతిపక్షాల పోరాట ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు జానారెడ్డి. తెలంగాణ సర్కార్ ప్రారంభించిన పథకంతో  తమ సమస్యలు తీరుతాయని ఒంటరి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com