మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

- July 22, 2017 , by Maagulf
మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి లక్ష రూపాయలు విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్స్‌, మ్యాజిక్‌ మష్రుమ్‌ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌ ఆఫీసర్‌ దత్తరాజుగౌడ్‌ శనివారం ముషీరాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. తార్నాకలో ఉంటున్న మహ్మద్‌ ఉస్మాన్‌(23), అరుణ్‌కుమార్‌ (19) 6 నెలలుగా ఎండీఎంఏ డ్రగ్‌, మ్యాజిక్‌ మష్రూమ్‌ పౌడర్‌ను చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నారు. అధికారులు ఇరువురి ఇళ్లపై దాడి చేసి 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌, ఆరు గ్రాముల మ్యాజిక్‌ మష్రూమ్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్‌కు బానిసైన అరుణ్‌కుమార్‌ ఉస్మాన్‌ జల్సాల కోసం డ్రగ్స్‌ విక్రయిస్తున్నాడు. కాగా, తార్నాకలోని నాగార్జుననగర్‌లో నివసిస్తున్న మహ్మద్‌ ఉస్మాన్‌ ఇంటి పైఅంతస్తులో ఉండే మహ్మద్‌ అబూబకర్‌ ఆలియాస్‌ సొహేల్‌ డ్రగ్స్‌ విక్రయంలో పాత నేరస్థుడు. అతని వద్ద అరుణ్‌కుమార్‌, ఉస్మాన్‌లు మాదకద్రవ్యాలను కొనుగోలు చేసేవారు. పాత నేరస్తుడైన సొహేల్‌ ఇంటిపై శుక్రవారం రాత్రి దాడి చేయగా ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాలను ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసి రూ.5 వేలకు గ్రాము చొప్పున విక్రయిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com