హరికేన్ ఇర్మా గూర్చి అమెరికాలో ఎమిరేట్ పౌరులను అప్రమత్తం చేసిన యూఏఈ రాయబార కార్యాలయం

- September 07, 2017 , by Maagulf
హరికేన్ ఇర్మా గూర్చి  అమెరికాలో ఎమిరేట్  పౌరులను అప్రమత్తం చేసిన యూఏఈ రాయబార కార్యాలయం

యూఏఈ : న్యూయార్క్ లోని యూఏఈ రాయబార కార్యాలయం ‘హారికేన్ ఇర్మా’ ప్రభావం గూర్చి అక్కడ ఉన్న ఎమిరేట్  పౌరులను  ట్విట్టర్ సందేశంలో అప్రమత్తం చేసింది. ఇప్పటికే కరేబియన్ ద్వీపాలలోని బార్బుడా, ప్యూర్టోరికో, సెయింట్ మార్టిన్‌‌లలో విధ్వంసం సృష్టించిన ‘హారికేన్ ఇర్మా’ ప్రభావం చూపనున్న ప్రాంతాలలోని అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అమెరికాలోని ప్రధాన భూభాగంలో తీరం దాటే సమయంలో గంటకు 360 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయనే వార్తలు అక్కడి వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. 5వ స్థాయి ప్రమాద హారికేన్‌గా పేర్కొనడంతో సురక్షిత ప్రాంతాలకే వెళ్లేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఫ్లోరిడా, మియామిల్లోని సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రజలు దూరప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా మియామి రోడ్లపై ఈ పరిస్థితి కనపడుతోంది. కార్లతో రోడ్లు రద్దీగా మారాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన విమానసంస్థలు భారీగా టికెట్ ధరలను పెంచేశాయి. మరీ ముఖ్యంగా ఫ్లోరిడాకు వెళ్లాలన్నా, ఫ్లోరిడా నుంచి బయటకు వెళ్లాలన్నా ప్రయాణికుల జేబుకు చిల్లు పడాల్సిందే. ఎందుకంటే ఏకంగా 800(దాదాపు రూ.50,000) డాలర్లను అదనంగా పెంచేశారు. ఇర్మా ప్రభావం తగ్గేంత వరకూ వేరే ప్రాంతాలలో ఉండొచ్చనే ఉద్దేశ్యంతో అనేకమంది విమాన టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుండగా విమానాల సంఖ్యను పెంచుతున్నామని పలు విమానసంస్థల యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి. ఇదిలావుండగా ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ జోన్ ఏ, జోన్ బీ ప్రాంతాలలోని దాదాపు లక్షమందిని సురక్షిత ప్రాంతానికి తరలింపుకు ఆదేశించారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ప్రజలను ఇలా తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గురువారం నుంచి ఈ తుఫాన్ ప్రభావం మొదలయ్యే  అవకాశం ఉందని తెలిపారు. ఇదిలావుండగా హారికేన్ ఇర్మా ప్రభావిత ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్‌లో సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హరికేన్ ఇర్మా కారణంగా కరేబియన్ అంతటా విస్తృతమైన విధ్వంసానికి దారితీసింది, దీంతో ద్వీపాలు తుడిచిపెట్టుకుపోవడంతో పటు కనీసం ఏడుగురు మరణించారు. అంతేకాక  ద్వీపంలోని దాదాపు 1,400 మందిలో దాదాపు 60 శాతం మంది నిరాశ్రయులుగా మారేరని అదేవిధంగా పలు   ప్రైవేటు గృహాలను దెబ్బతిన్నాయని వార్తలు తెలియచేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com