ఎఫ్-35 స్టెల్త్ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్...
- October 16, 2017
'స్టెల్త్ టెక్నాలజీ..' ప్రస్తుతం అగ్రరాజ్యాల రహస్య ఆయుధం ఇదే..! దీనికోసం పలు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎంతగా అంటే పొరుగుదేశాల కంప్యూటర్లను హ్యాక్ చేసి సాంకేతికతను అపహరించే స్థాయికి చేరుకున్నాయి. ఇటువంటి పనుల్లో పొరుగు దేశమైన చైనా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటోంది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్-35 స్టెల్త్ జెట్, పి-8 నిఘా విమానాల సమాచారాన్ని ఏడాది క్రితం తస్కరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
రెండో కంటికి తెలియకుండా..
కెనడాలో నివసించే చైనాకు చెందిన సు బిన్ అనే 50ఏళ్ల వ్యక్తి ఈ టెక్నాలజీ అపహరణకు మూల కారకుడని ఆస్ట్రేలియా ప్రభుత్వం గురువారం నిర్ధారించింది. ఇతనికి లోడ్ టెక్నాలజీ పేరుతో బీజింగ్లో ఒక కంపెనీ ఉంది. అంతేకాకుండా అతనికి ఒక హ్యాకింగ్ సంస్థ కూడా ఉంది. ఇది వివిధ దేశాల సైనిక సమాచారాలను హ్యాక్ చేస్తుంటుంది. చైనా సైనికాధికారుల మద్దతు సైతం ఆయనకు ఉంది. దీనికోసం 'చైనా చాపర్' టెక్నిక్ను వాడాడు.
గత ఏడాది జులైలో ఆస్ట్రేలియా వైమానిక దళానికి చెందిన దాదాపు 30 గిగాబైట్ల డేటాను అపహరించి చైనా సైన్యానికి విక్రయించినట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సిగ్నల్స్ డైరెక్టరేట్ నవంబర్ నెల్లో గానీ గుర్తించలేకపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమెరికా ఆయుధ చట్టం కింద నిషేధించిన సమాచారాన్ని సు బిన్ బృందం అపహరించింది.
వీటిల్లో స్మార్ట్ బాంబ్స్ సాంకేతిక సమాచారం, జాయింట్ స్ట్రైక్ ఫైటర్స్ వివరాలు, పొసిడాన్ నిఘా విమాన పెట్రోలింగ్ సమాచారం, యుద్ధ నౌకల సమాచారం చైనా హ్యాకర్లకు చిక్కింది. ఆస్ట్రేలియా చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద సబ్మెరైన్ ప్రాజెక్టు వివరాలు హ్యాకర్ల బారిన పడ్డాయా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు.
హ్యాకింగ్ జరిగింది ఇలా..
లక్ష్యంగా చేసుకున్న కంపెనీల్లోని ఉద్యోగులకు పరిచయస్తుల పేరుతో ఫిషింగ్ ఈ-మెయిల్స్ను పంపించారు. వారు ఆ మెయిల్స్ను తెరవగానే హ్యాకర్లు మాల్వేర్ను పంపి వారి కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తర్వాత తాపీగా ఆ కంప్యూటర్లోని సమాచారాన్ని కాపీ చేసుకొని అక్కడి నుంచి మరో కంప్యూటర్లోకి చొరబడ్డారు. ఈ కాపీ చేసిన సమాచారాన్ని సు సిబ్బంది చైనా భాషలోకి మార్చి ఒక నివేదిక తయారు చేశారు.
ఈ సమాచారం మొత్తాన్ని చైనా ప్రభుత్వం నిర్వహించే కంపెనీలకు విక్రయించాడు. ఈ వ్యవహారంలో సు పెద్దమొత్తంలోనే సంపాదించినట్లు నిఘా సంస్థలు పేర్కొన్నాయి.
అమెరికాను మించిపోవచ్చు..
సు బిన్ చైనాలోని ఒక విమానాల తయారీ సంస్థకు ఆస్ట్రేలియాకు సంబంధించిన కీలక సమాచారాన్ని విక్రయించాడు. ఈ సందర్భంగా అతను ఒక మెయిల్ పంపించాడు. 'ఈ కీలక సమాచారంతో మనం కూడా అమెరికా స్థాయిలో యుద్ధ విమానాలు తయారు చేద్దాం.' అని పేర్కొన్నాడు.
* మరో మెయిల్లో అమెరికా, యూరప్ దేశాలకు చెందిన కీలక సైనిక అధికారుల సమాచారాన్ని చైనాకు అందజేశాడు.
* మరో మెయిల్లో సి-17 వ్యూహాత్మక రవాణా విమానానికి చెందిన సాంకేతిక సమాచారాన్ని చైనాకు చేరవేశాడు. ప్రస్తుతం ఈ విమానాలను ఆస్ట్రేలియా, భారత్, యూకే, కెనడా, నాటో బలగాలు వినియోగిస్తున్నాయి.
* బోయింగ్ సంస్థకు చెందిన 6,30,000 ఫైల్స్ను సు బృందం అపహరించింది. 2010 నుంచి బోయింగ్ ఫైల్స్ను తస్కరించింది.
అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ విచారణలో ఈ ఈ-మెయిల్స్ వెలుగులోకి వచ్చాయి.
ఇటీవలే వైమానిక దళంలోకి చైనా స్టెల్త్ జెట్లు..
ఇటీవలే చైనా సొంతంగా తయారు చేసిన స్టెల్త్ జెట్ విమానం చెంగ్డూ జె-20ను వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీని తమ శాస్త్రవేత్తలు చెమటోడ్చి కనుగొన్నట్లు పోజు కొట్టింది. అసలు రహస్యం ఆస్ట్రేలియా హ్యాకింగ్లో దాగి ఉందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
మేధోచౌర్యం చైనా నైజం..
జె సిరీస్లో చైనా తయారు చేసే చాలా రకాల విమానాలు 'కాపీ-పేస్ట్' టెక్నాలజీనే..! జె-7లు రష్యాకు చెందిన మిగ్-21 నకళ్లు. రష్యాకే చెందిన సు-27 ఫాల్కనర్ మల్టీరోల్ ఫైటర్ జెట్స్ నుంచి జె-11 విమానాలను తయారు చేసింది. ఇక అమెరికా నుంచి ఎఫ్- 35 విమాన సమాచారాన్ని అపహరించి జె-31, జె-20 ఫైటర్లను సిద్ధం చేసింది. అమెరికా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను హ్యాక్ చేసి మానవ రహిత విమానాలను చైనా తయారు చేసింది. చైనా తయారు చేసే మానవ రహిత విమానాలు అచ్చుగుద్దినట్లు అమెరికా విమానాలను పోలి ఉంటాయి.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









