ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని దాడి మా పనే: ఐసిస్‌

- November 07, 2017 , by Maagulf
ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని దాడి మా పనే: ఐసిస్‌

ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని ఓ టెలివిజన్‌ ఛానెల్‌పై దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. స్థానిక షంషాద్‌ టీవీ ఛానల్‌ భవనంలోకి చొరబడ్డ కొందరు దుండగులు అక్కడి ఉద్యోగులపై బాంబులు విసురుతూ కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. రెండు గంటల పాటు దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
'పోలీసుల దుస్తుల్లో వచ్చిన దుండగులు సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి లోపలికి చొరబడ్డారు. గ్రనేడ్లు విసురుతూ కాల్పులు జరిపారు. కొద్ది మందికి తూటాలు తగిలాయి. చాలా మంది ఉద్యోగులు తప్పించుకొని వేరే అంతస్తులోకి పారిపోయారు' అని అక్కడ ఉద్యోగం చేసే అబెద్‌ ఎషాస్‌ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు టెలివిజన్‌ కార్యాలయ భవనం గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని మట్టుబెట్టారు.

మరొక దుండగుడిని భవనం వెలుపలే కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో టెలివిజన్‌ ప్రసారాలను తాత్కాలికంగా నిలిపివేశారు. రెండు గంటల తర్వాత వాటిని పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com