ఎన్ఆర్ఐలకు చెమటలు పట్టిస్తోన్న గ్రీన్ కార్డ్ ప్రతిపాదనలు
- January 04, 2018
భారతీయుల గ్రీన్ కార్డ్ ఆశలపై అమెరికా దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెండింగ్లో ఉన్నంత వరకూ యూఎస్లో ఉండడానికి ఏ సమస్యా ఉండదని ధీమాగా ఉన్న ఎన్నారైలకు అమెరికా ప్రభుత్వం తాజా ప్రతిపాదన చెమటలు పట్టిస్తోంది. USలో స్థిరపడి, అక్కడే ఇళ్లు కూడా కొనుక్కున్న భారతీయులకు గ్రీన్ కార్డ్ రాకుంటే తిరిగి స్వదేశానికి చేరుకోక తప్పదనే భయం మొదలైంది.
H1B వీసాపై వచ్చి దేశంలోనే ఉండిపోతున్న వారికి చెక్ పెట్టేందుకు అమెరికా ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం ఆరేళ్ల లోపు గ్రీన్కార్డు రాకుంటే ఇక అమెరికాలో ఉద్యోగం చేయడానికి కుదరదు. వీసాల పొడిగింపుపై హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సవరణను ప్రతిపాదించింది. ఇటు అమెరికా సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం కూడా వీసాల జారీలో విధాన, నియంత్రణా పరమైన మార్పులు పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికాలో ఉన్న భారతీయుల్లో కలవరం మొదలైంది.
H1B వీసాపై అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే ఉన్నారు. వీరిలో 40 శాతం వరకూ తెలుగు వారున్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే అక్కడ స్థిరపడ్డారు. గ్రీన్ కార్డ్ రాకుంటే తిరిగి స్వదేశానికి వెళ్లాలన్న అమెరికా ప్రభుత్వ తాజా ప్రతిపాదన వీరందరికీ గుబులు పుట్టిస్తోంది. కానీ నిపుణులు మాత్రం దీని వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బందేమీ లేదని అంటున్నారు. ఈ బిల్లు వల్ల అమెరికాకు కూడా నష్టమేనని చెబుతున్నారు.
బీటెక్ పూర్తి చేయగానే రెక్కలు కట్టుకుని అమెరికాలో వాలే కొందరు భారతీయులు MS తర్వాత మూడేళ్ల పాటు OPT చేస్తున్నారు. ఆ ట్రైనింగ్లోనే H1B వీసాకు దరఖాస్తు చేస్తున్నారు. మూడేళ్లు వీసా వస్తే, మరో మూడేళ్లు పొడిగించుకుంటున్నారు. అదే టైంలో తమ కంపెనీల ఆమోదంతో గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారు. అది పెండింగ్లో ఉన్నంత కాలం H1B వీసా గడువు పొడిగించుకుంటూ అమెరికాలోనే ఉండిపోతున్నారు. గ్రీన్కార్డు దక్కితే అక్కడే స్థిరపడవచ్చు. అయితే.. ఓటు హక్కు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందటం కుదరదు. సిటిజన్ షిప్ ఉంటేనే ఇవి దక్కుతాయి.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న విధానం ప్రకారం ఆరేళ్లలో గ్రీన్ కార్డ్ రావడం అన్నది దాదాపు అసాధ్యం. 2007లో చేసుకున్నవారికే ఇప్పటివరకూ గ్రీన్ కార్డ్ రాలేదు. అమెరికా ప్రభుత్వం ఇంకా వారి దరఖాస్తులనే పరిశీలిస్తోంది. అలాంటిది కొత్తగా యూఎస్ వెళ్లిన వారికి గ్రీన్కార్డ్ రావడం అనేది కలే. ఆరేళ్లలో వారికి గ్రీన్కార్డ్ వచ్చే అవకాశాలే లేవు. ఇప్పుడు హోంల్యాండ్ తాజా ప్రతిపాదన ప్రకారం.. భవిష్యత్తులో విదేశీయులెవరికీ.. గ్రీన్కార్డ్ ఇవ్వకూడని విధంగా రూల్స్ తయారవుతున్నట్లు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







