వర్ణవివక్ష కారణంగా..

- March 28, 2018 , by Maagulf
వర్ణవివక్ష కారణంగా..

మాస్కో : రష్యాలో జాతివివక్ష ఘటన చోటుచేసుకుంది. రష్యాకు చెందిన ఏరోఫ్లోట్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది.. న్యూయార్క్‌ వెళ్లాల్సిన ఐదుగురు ఆసియన్‌ అమెరికన్‌ ప్రయాణికులను బలవంతంగా దిల్లీకి పంపించారు. వర్ణ వివక్ష కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

జనవరి 7న దిల్లీ నుంచి న్యూయార్క్‌కు ఏరోఫ్లోట్‌ విమానంలో ప్రయాణికులు బయలుదేరారు. వీరు మాస్కోలో దిగి కనెక్టింగ్‌ ఫ్లైట్‌ ద్వారా న్యూయార్క్‌ చేరుకోవాల్సి ఉంది. అయితే న్యూయార్క్‌లో తీవ్రంగా మంచు కురుస్తుండటంతో జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సిన కనెక్టింగ్‌ ఫ్లైట్‌ను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు మాస్కోలోనే చిక్కుకున్నారు. అయితే వీరి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ విమానంలో సరిపడా సీట్లు లేవని పలువురి ప్రయాణికులకు అభ్యంతరం చెప్పారు. వీరికి మాస్కోలో ఎలాంటి వసతి కల్పించలేమని చేతులెత్తేశారు. ప్రయాణికుల్లో దక్షిణాసియా సంతతికి చెందిన వారు విమానం దిగకపోతే వారిని తిరిగి భారత్‌కు పంపిస్తామని ఏరోఫ్లోట్‌ సిబ్బంది హెచ్చరించినట్లు ప్రయాణికులు తెలిపారు. అలాగే ఆ ప్రయాణికులకు ట్రాన్సిట్‌ వీసా కూడా ఇవ్వలేదు.

దీంతో ప్రయాణికులు మాస్కోలోని యూఎస్‌ రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. యూస్‌ సిటిజన్లను ఇలా వారికి ఇష్టం లేకుండా వేరే దేశాలకు పంపించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై ఆ ఎయిర్‌లైన్‌ సంస్థతో ఎంబసీ అధికారులు మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ వారు స్పందించలేదు.

చివరకు చేసేదేమీ లేక ఆ ఐదుగురు ప్రయాణికులు భారత్‌కు వెళ్లే విమానం ఎక్కారు. ఏరోఫ్లోట్‌ హెచ్చరికల కారణంగా తమ భద్రతపై ఆందోళన చెంది తిరిగి దిల్లీకి వచ్చామని ప్రయాణికులు చెప్పారు. వారు తిరిగి దిల్లీకి చేరుకోగానే.. న్యూయార్క్‌కు మరో ఏరోఫ్లోట్‌ విమానం వారం వరకూ లేదని తెలుసుకున్నారు. దీంతో వారిలో నలుగురు ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా వాషింగ్టన్‌కు చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com