సింగపూర్‌లో ఉగాది కల్చరల్‌ నైట్‌

- April 01, 2018 , by Maagulf

సింగపూర్‌:సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది కల్చరల్‌ నైట్‌ను  మార్చి 31 శనివారం సాయంత్రం స్థానిక కల్లాంగ్‌ థియేటర్, వన్‌ స్టేడియం వాక్‌లో భారీ ఎత్తున నిర్వహించారు . ఆద్యంతం వినోదభరితంగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా సాగిన  ఈ కార్యక్రమానికి సుమారు 1700 మంది స్థానిక తెలుగు ప్రజలు హాజరయ్యారు. ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌ ముఖ్య అతిథిగా పాల్గొనగా యాంకర్‌ శ్యామల, సింగర్స్‌ సత్య యామిని, అనుదీప్‌, ప్రవీణ్‌ కుమార్‌, వీఆర్‌ లక్ష్మీ , కమేడియన్స్‌ మాస్‌ అవినాష్‌, కెవ్వు కార్తిక్‌, తాగుబోతు రాజమౌళి, డ్యాన్సర్స్‌ ఆట సందీప్‌ టీమ్‌తో పాటు ఢీ జోడి ఫేమ్ ప్రియాంకలు ప్రేక్షకులను  మంత్రముగ్ధులను చేశారు 

ఈసందర్భంగా చంద్రబోస్‌ గారు తన యిరవై మూడు సంవత్సరాల సాహితీప్రస్థానాన్ని పాటల హారంగా సింగపూర్ తెలుగువారి ముందుంచారు. ఈప్రయత్నంలో తెలుగు గొప్పదనాన్ని పాటగా మలచినప్పుడు ప్రేక్షకులు తన్మయత్వంలో తమస్థానాలనుంచి  లేచినుంచొని  అందరూ తాము పొందిన గగుర్పాటును ప్రదర్శించారు.తెలుగుభాష పరివ్యాప్తికి , పరిరక్షణ గురించి పాటుపడుతున్న తెలుగు సమాజం కృషిని, తాపత్రయాన్ని అభినందించారు. త్వరలో జరగనున్న కార్మిక దినోత్సవ కార్యక్రమ సన్నాహాలలో భాగంగా చంద్రబోస్ గారి చేతుల మీదుగా  క్రికెట్ క్రీడాపోటీలు ఆరంభించబడ్డాయి.

అధ్యక్షులు  కోటిరెడ్డి మాట్లాడుతూ కుల,మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కివక్కాణించారు. ఉగాది కల్చరల్‌ నైట్‌ 2018 కు ముఖ్య స్పాన్సర్స్ గా ఉన్న యప్ టీవీ, గ్రీన్ యేకర్స్, ఆదిత్య బిల్దర్స్ మరియు యితర స్పాన్సర్స్ కు ,అశేషంగా ఆదరించి ఈకార్యక్రమంలో పాల్గొన్న  ప్రతిఒక్కరికీ , ఫేస్బుక్ లైవ్ లో సందర్శించిన నలభైఏడువేల మందికి  కోటిరెడ్డి కృతఙతలు తెలియజేసారు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలూ కృషి చేసిన సింగపూర్‌ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులు  సత్య ఎస్‌, జ్యోతీశ్వర్‌, నాగేష్‌, వినయ్‌, రామ్‌, అనిల్‌, ప్రదీప్‌, ప్రసాద్,మల్లిక్   మరియు ఇతర స్వచ్ఛంద కార్యకర్తల కృషిని కార్యదర్శి సత్య చిర్ల కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com