ఇమ్రాన్‌ ‘దేవుడి’ ఫోటోపై పాక్‌ అసెంబ్లీ ఆగ్రహం

- April 12, 2018 , by Maagulf

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ (పీటీఐ) చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను హిందూ దేవుడిగా అభివర్ణిస్తూ రూపొందిన ఫోటోపై పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో చర్చ జరిగింది. పాక్‌ అసెంబ్లీలో హిందూ ప్రతినిధులు ఈ అంశాన్ని లేవనత్తెగా సోషల్‌ మీడియాలో ఈ ఫోటో వ్యాప్తిని అరికట్టాలని, దీన్ని రూపొందించిన వారిని పట్టుకోవాలని దేశీయాంగ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ ఫోటోగ్రాఫ్‌తో విద్వేష ప్రసంగాలు, సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హిందూ ప్రతినిధులు ఆందోళన చేపట్టగా నేషనల్‌ అసెంబ్లీ స్పీకర్‌ సర్ధార్‌ అయాజ్‌ సాధిక్‌ ఈ అంశాన్ని దేశీయాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ ముఖాన్ని తగిలించిన ఓ హిందూ దేవత ఫోటోను సభ్యుడు రమేష్‌ లాల్‌ స్పీకర్‌కు అందచేశారని డాన్‌ పత్రిక పేర్కొంది. ఈ అంశంపై విచారణ చేపట్టాలని హిందూ ప్రతినిధులు స్పీకర్‌ను కోరారు. సభ్యుల కోరిక మేరకు వారం రోజుల్లో విచారణ పూర్తిచేయాలని దేశీయాంగ శాఖ అధికారులను ఆదేశించిందని ఆ పత్రిక తెలిపింది. కాగా, దేశంలో హిందువుల ప్రయోజనాల పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడిఉందని ఇమ్రాన్‌ నేతృత్వంలోని పీటీఐ స్పష్టం చేసింది. పార్టీ సోషల్‌ మీడియా విభాగం ఈ ప్రచారాన్ని చేపట్టిందని పీటీఐ వైస్‌చైర్మన్‌ షా మహ్మద్‌ ఖురేషీ తెలిపారని డాన్‌ కథనం పేర్కొంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే  దేశం విడిచివెళ్లిన హిందువులు తిరిగి పాకిస్తాన్‌ చేరుకోవచ్చని 2014లో ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో హిందూ, కలాష్‌ వర్గీయులను బలవంతంగా మతమార్పిడులకు గురిచేయడం పట్ల కూడా గతంలో ఇమ్రాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com