భారత వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి..

- August 18, 2018 , by Maagulf
భారత వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి..

భారత వాతావరణ శాఖ అంచనాలే నిజమయ్యాయి.. ఉత్తర, దక్షిణ భారతదేశంలో సాధారణానికి మించి వర్షాలు పడుతున్నాయి. సీజన్‌ మొదట్లో ఊరించి ఉసూరుమనిపించిన మేఘాలు మళ్లీ కుంభవృష్టి కురిపిస్తున్నాయి. జులై రెండో వారం నుంచి మొదలైన వర్షాలు ఇప్పటికీ కురుస్తూనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుడపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి.

నైరుతి రుతుపవనాలు ఉత్తరాది నుంచి వెనక్కు రావడం మొదలైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా, ఏపీపై నైరుతి రుతుపవనాలు కదులుతున్నట్లు చెప్పారు. నేడు ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో మంచి వర్ష పాతం నమోదవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ బంగ్లా-ఒడిశా తీరాలకు ఆనుకుని 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడతాయన్నారు.

ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రెండ్రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com