కేరళ:ప్రకృతి విలయానికి విలవిలలాడిన మరో షాక్

- September 04, 2018 , by Maagulf
కేరళ:ప్రకృతి విలయానికి విలవిలలాడిన మరో షాక్

కేరళ:ప్రకృతి విలయానికి విలవిలలాడిన కేరళను కొత్తగా ర్యాట్‌ ఫీవర్‌ వణికిస్తోంది..వర్షాలు తగ్గుముఖం పట్టి వరద నుంచి బయటపడుతున్నా చాలా ప్రాంతాల్లో రోగాలు విరుచుకుపడుతున్నాయి. విషజ్వరాలు, అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వివిధ రోగాలతో ఆసుపత్రిలో చేరిన 13,800 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక ర్యాట్‌ ఫీవర్‌ కారణంగా ఇప్పటి వరకు పది మందికిపైగా చనిపోవడం వ్యాధి తీవ్రతను గుర్తు చేస్తోంది. వీరిలో ఆరుగురు గత ఆరు రోజుల్లోనే మృతిచెందారు. కలుషిత నీటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వరదల ప్రభావంతో ఉగ్రరూపం దాల్చింది. వర్షాలు తగ్గినప్పటి నుంచి రాష్ట్రంలో మొత్తం 400కుపైగా ర్యాట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. అధికారికంగా 11 మందని చెబుతున్నప్పటికీ, 50 మందికిపైగానే ఈ వ్యాధి కారణంగా మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.. వరదల సమయంలో ఈ వ్యాధిసోకిన జంతువులు విడుదలచేసే వ్యర్ధాల నుంచి మనుషులకు అంటుకుంటుంది.. దీనిని ర్యాట్‌ఫీవర్‌ లేదా లెప్టోస్పిరోసిస్‌ వ్యాధిగా పిలుస్తారు. ఈ వ్యాధి కిడ్నీ, లివర్‌తోపాటు మెదడుపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది.. వ్యాధినిరోధక శక్తిని కోల్పోయేలా చేస్తుంది. ఒక్కో అవయవం దెబ్బతినేలా చేసి మృత్యువుకు దగ్గర చేస్తుంది. వరదల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే పునర్నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్న కేరళలో ర్యాట్‌ ఫీవర్‌ విజృంభిస్తుండటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు ప్రభుత్వం కూడా వ్యాధి నివారణ చర్యలు వేగవంతం చేసింది..

మరోవైపు కేరళకు పునర్‌ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఏడాది వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా ఎలాంటి వేడుకలను జరుపుకోవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహించే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, యూత్‌ ఫెస్టివల్‌ వంటి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాలకు వెచ్చించే నిధులను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తరలించాలని నిర్ణయించింది. ఈ నిధులు రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com