ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత
- June 27, 2019హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయనిర్మల తండ్రిది స్వస్థలం చెన్నై కాగా, తల్లిది గుంటూరు జిల్లా నరసరావుపేట. తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు విజయనిర్మల.
ఏడో ఏటనే సినీరంగ ప్రవేశం
విజయనిర్మల అసలు పేరు నిర్మల. తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్కు కృతజ్ఞతగా విజయనిర్మలగా పేరు మార్చుకున్నారు. అంతేకాక అప్పటికే నిర్మలమ్మ పరిశ్రమలో నిలదొక్కుకొని ఉండడం కూడా ఓ కారణం. ప్రముఖ నటుడు నరేశ్ విజయనిర్మల కుమారుడు. నటి జయసుధకు ఈమె పిన్ని. 1950లో మత్య్సరేఖ అనే తమిళ చిత్రం ద్వారా విజయనిర్మల తన ఏడో ఏటనే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. పదకొండో ఏట ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా కథానాయికగా అరంగేట్రం చేశారు. అక్కడి నుంచి సుమారు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పిన్నీ తదితర చిత్రాల్లో నటించారు. ‘పెళ్లి కానుక’ సీరియల్తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు. ఏడేళ్ల వయస్సులోనే ఆమె సోదరి రావు బాలసరస్వతి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. పి.పుల్లయ్య దర్శకత్వంలో తొలిసారిగా ఆమె కెమెరా ముందుకు వచ్చారు. కృష్ణుడి వేషంలో బాలనటిగా చిత్రపరిశ్రమలో విజయ నిర్మల అడుగుపెట్టింది. కృష్ణుడి వేషంలో ఉన్న విజయనిర్మలకు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ ఆమెకు దిష్టి తీశారు.
దర్శకురాలిగా గిన్నిస్బుక్లో..
ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్ బుక్లో చోటు సంపాదించారు. తొలిసారి ఆమె ‘మీనా’ అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించగా.. అప్పటి నుంచి 2009 వరకూ మొత్తం 44 సినిమాలు తీశారు. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు.
సూపర్స్టార్ కృష్ణతో వివాహం..
‘సాక్షి’ చిత్రంతో తొలిసారిగా సూపర్స్టార్ కృష్ణతో నటించారు విజయనిర్మల. ఈ చిత్రమే వారి వివాహ బంధానికి కారణమైంది. తిరుపతిలో వీరి వివాహం జరిగింది. వివాహం అయ్యాక విజయ నిర్మల ‘అమ్మకోసం’ చిత్రంలో నటించింది. 2009లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన నేరము-శిక్ష చిత్రం దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం. 47 చిత్రాల్లో కృష్ణతో కలిసి ఆమె వెండితెరను పంచుకున్నారు. హీరోయిన్గా నటించిన తన తొలి చిత్రం ‘రంగులరాట్నం’కి నంది పురస్కారం అందుకున్నారు. సినీ రంగంలో ఇచ్చే ఉన్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును కూడా ఆమె అందుకున్నారు.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్