ముంబై:భారీ అగ్నిప్రమాదం.. సహాయక చర్యల్లో పాల్గొన్న రోబో

- July 23, 2019 , by Maagulf
ముంబై:భారీ అగ్నిప్రమాదం.. సహాయక చర్యల్లో పాల్గొన్న రోబో

ముంబై: భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాంద్రా ప్రాంతంలోని ఎంటీఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ కార్యాలయ భవనంలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. 9 ఫ్లోర్‌ల ఈ బిల్డింగ్‌లోని 3,4 అంతస్తుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో దాదాపు వంద మందికి పైగా కార్యాలయ సిబ్బంది భవనంలో చిక్కుకున్నారు. భారీగా పొగ చేరడంతో అందులో చిక్కుకున్న వారు సహాయం కోసం పెద్ద ఎత్తున కేకలు వేశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది..16 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేశారు. భవనంలో చిక్కుకున్న 86 మందిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. మిగిలిన వారందరిని క్రేన్ల సాయంతో బయటకు తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో భారీగా పొగచూరడంతో సమీపంలోని స్కూళ్లలోని విద్యార్ధులతోపాటు బాంద్రా రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ భారీ రిస్క్యూ ఆపరేషన్‌లో సుమారు 175 మంది అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఎలాంటి ప్రాణ ,ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మంటలు ఆర్పడానికి అగ్నిమాపక వాహనంతో పాటు మొట్ట మొదటిసారి ఈ బిగ్ ఆపరేషన్‌లో రోబో సహాయాన్ని తీసుకున్నారు. అగ్నిమాపక వాహనాలతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న ఈ రోబో పేరు రోబోఫైర్. దాన్ని ఓ వ్యక్తి రిమోట్ సహకారంతో నియంత్రిస్తాడు. దానికి ఓ కెమెరా కూడా అమర్చి ఉంటుంది. అలాగే కీటకం మాదిరిగా పనిచేస్తూ ఏ నేల మీద అయినా సులభంగా ముందుకు వెళ్లగలదు. కెమెరా ద్వారా ఎవరైనా భవనంలో చిక్కుకొని ఉన్నారా అనే విషయాన్ని కూడా పసిగట్టి అగ్నిమాపక సిబ్బందిని అలర్ట్ చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com