సౌదీకు ఆయుధాల అమ్మకం

- July 28, 2019 , by Maagulf
సౌదీకు ఆయుధాల అమ్మకం

లండన్‌: తాను విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో 1.2 బిలియన్‌ పౌండ్ల ఆయుధాలను సౌదీ అరేబియాకు విక్రయించినట్లు బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ అంగీకరించారు. ఇందులో 880 మిలియన్‌ పౌండ్లు బాంబులు, గ్రెనెడ్లు, క్షిపణులకు అవసరమైన ఎంఎల్‌ 4 లైసెన్స్‌ల కోసం, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లకు అవసరమైన ఎంఎల్‌10 లైసెన్స్‌ల కోసం 270 మిలియన్‌ పౌండ్లను వెచ్చించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆయుధాల ఎగుమతికి సంబంధించిన లైసెన్స్‌ల దరఖాస్తులపై నిర్ణయాధికారి అంతర్జాతీయ వాణిజ్య కార్యదర్శి. అయితే సౌదీ నేతృత్వంలో యెమెన్‌పై బాంబు దాడి జరిగిన నాటి నుండి లైసెన్స్‌ దరఖాస్తులపై నిర్ణయం తీసుకునేందుకు విదేశాంగ మంత్రికి అనుమతి లభించింది. ఇదే విషయాన్ని అప్పటి ఒక ప్రభుత్వ డాక్యుమెంట్‌ పేర్కొంది. యెమెన్‌ రాజధాని సనాలోని ఒక కర్మాగారంపై 2016 ఆగస్టును సౌదీ బలగాలు దాడి చేసి 14 మందిని హతమార్చిన రెండు రోజుల అనంతరం ఆయుధాల బదిలీకి సంబంధించిన పత్రాలపై జాన్సన్‌ సంతకాలు చేశారు. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన పత్రాలు ఈ వాస్తవాలను వెల్లడించాయి. 
అనంతరం రెండు నెలల తరువాత సౌదీ బలగాలు అల్‌కుబ్రా హాల్‌పై జరిపిన దాడిలో 140 మంది మరణించారు. ఇది జరిగిన వారాల వ్యవధిలోనే బాంబుల కోసం జరిగిన మరో ఆయుధ బదిలీ పత్రాలపై సంతకాలు చేశారు. 
ఆయుధ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆండ్యూ స్మిత్‌ దీనిపై వ్యాఖ్యానిస్తూ ప్రస్తుతం బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న జాన్సన్‌ తన ఆలోచనలను మార్చుకుని ఉంటాడని విశ్వసించలేమన్నారు. ప్రధాన మంత్రిగా ఆయన ప్రపంచంలోని నియంతృత్వ దేశాలకు మిలటరీ మద్దతును కొనసాగించవచ్చునని పైవిషయాలు చెప్పకనే చెబుతున్నాయన్నారు. ''జాన్సన్‌ తనను ఒక జోకర్‌గా అభివర్ణించుకుంటున్నప్పటికీ ఆయన మద్దతిచ్చిన ఆయుధాల అమ్మకాలతో విధ్వంసకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించి, పలువురి ప్రాణాలు బలిగొన్న విఫలమైన విధానాలు కాకుండా కొత్తగా ఆలోచించాలి'' అని ఆండ్రూస్మిత్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com