భారత్ లో పెట్టుబడులు పెట్టనున్న సౌదీ..నేటి పరిస్థితులు అందుకు సహకరించేనా?

- September 30, 2019 , by Maagulf
భారత్ లో పెట్టుబడులు పెట్టనున్న సౌదీ..నేటి పరిస్థితులు అందుకు సహకరించేనా?

న్యూఢిల్లీ : భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే అంశంపై పరిశీలిస్తున్నట్టు సౌదీ వెల్లడించింది. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతిదారు సౌదీ అరేబియా భారత్‌లోని పెట్రో కెమికల్స్‌, మౌలిక సదుపాయాలు, మైనింగ్‌ వంటి రంగాలలలో100 బిలియన్‌ డాలర్ల(రూ.7,05,085 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దేశ వృద్ధి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ రాయబారి డాక్టర్‌ సౌద్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ సతి తెలిపారు. సౌదీకు భారత్‌ ఒక ఆకర్షణీయమైన పెట్టుబడిదారి దేశమని, చమురు, గ్యాస్‌, గనులు వంటి కీలక రంగాలలో భారత్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కొనసాగించే లక్ష్యంతో ఉన్నట్టు ఆయన చెప్పారు. ఇంధనం, శుద్ధి, పెట్రోకెమికల్స్‌, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఖనిజాలు, మైనింగ్‌ రంగాలలో 100 బిలియన్‌ డాలర్ల (రూ.7,05,085 కోట్లు) విలువైన పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియా చూస్తోందన్నారు. ఆదివారం సౌదీ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. సౌదీ అరేబియాలోనే అతిపెద్ద చమురు దిగ్గజంగా ఉన్న అరాంకో భారత్‌లోని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌తో ప్రతిపాదించిన భాగస్వామ్యం, రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఇంధన సంబంధాల వ్యూహాత్మక స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నదని ఆయన చెప్పారు. పశ్చిమ తీర ప్రాంతంలో చమురు శుద్ధి కర్మాగారంలో 44 బిలియన్‌ డాలర్ల (రూ.3,10,237 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు సౌదీలోని ప్రముఖ చమురు శుద్ధి కర్మాగారం అరాంకో ప్రతిపాదించింది.

విజన్‌ 2030లో భాగంగా భారత్‌, సౌదీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం సౌదీ యువరాజు సల్మాన్‌ కృషి చేస్తున్నారు. సౌదీ నుంచి 17శాతం చమురు, 32శాతం ఎల్‌పీజీ భారత్‌ దిగుమతి చేసుకుంటున్నదని మహ్మద్‌ అల్‌ సతీ తెలిపారు. భారత్‌, సౌదీ మధ్య 34 బిలియన్‌ డాలర్ల (రూ.2,39,728 కోట్లు) వాణిజ్యం కొనసాగుతున్నదని అన్నారు. రానున్న రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయనున్నట్టు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com