ట్విట్టర్ పై అసహనం..MASTODON లో చేరిక
- November 10, 2019MASTODON భారత ట్విటర్ యూజర్లు చాలా మంది పెద్దగా పేరు లేని మాస్టోడాన్కు మారిపోతున్నారు. "ప్రముఖులు... ప్రభావశీలుర"తో సహా చాలా మంది భారతీయ ట్విటర్ వినియోగదారులు అంతగా ఎవరికీ తెలియని 'మాస్టొడాన్' అనే ప్రత్యామ్నాయ యాప్కు మారిపోతున్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యల విషయంలో ట్విటర్ "పూటకో మాట" చెబుతోందనే విమర్శలే అందుకు కారణంగా కనిపిస్తోంది.
భారత సుప్రీం కోర్టు న్యాయవాది అకౌంటును ట్విటర్ రెండు సార్లు సస్పెండ్ చేయడమే దీనికి నాంది పలికింది. ఒకసారి ఒక ఫోటో విషయంలో, మరోసారి రీట్వీట్ చేసిన ఒక కవిత గురించి అభ్యంతరాలు చెబుతూ ట్విటర్ సంజయ్ హెగ్డే అనే ఆ లాయర్ అకౌంటును తొలగించింది. మైనారిటీల మీద వచ్చే అనుచిత వ్యాఖ్యల విషయంలో ట్విటర్ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందని సంజయ్ హెగ్డే మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ట్విటర్ తోసిపుచ్చింది. "సైద్ధాంతిక లేదా రాజకీయ" దృష్టి కోణాల ప్రాతిపదికన కంటెంట్ను మాడరేట్ చేయలేమని ట్విటర్ ఒక ప్రకటన కూడా చేసింది.
అయితే, భారతదేశంలో కంటెంట్ మాడరేషన్ విషయంలో ట్విటర్కు అస్తవ్యవస్తంగా వ్యవహరించిన చరిత్ర ఉందని ట్విటర్ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నవారు, సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. "భారత ప్రభుత్వం వాట్సాప్ మీద నిఘా ప్రారంభించేంత వరకు ఆ కంపెనీ తన వేదిక మీద కనిపించే తప్పుడు సమాచారానికి సంబంధించిన ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోలేదు. అదేవిధంగా, ట్విటర్ కూడా విద్వేషపూరిత వ్యాఖ్యల విషయంలో ఏమాత్రం స్పందించలేదు. అది పని చేసే తీరు ఎంతో పక్షపాతంగా ఉంటోంది" అని ఇంటర్నెట్ను విశ్లేషించే మీడియానామా పత్రిక ఎడిటర్ నిఖిల్ పహ్వా బీబీసీ ప్రతినిధి కృతిక పాఠితో చెప్పారు.
జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ (సీపీజే) తాజా నివేదిక ప్రకారం ట్విటర్ తన "దేశాలకు సేవలు నిలిపివేసే" విధానంలో భాగంగా 100 అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు పది లక్షల ట్వీట్లను తొలగించింది. బ్లాక్ అయిన ట్వీట్లలో అధిక భాగం ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్పందనా వచ్చినవే. వాటిని ప్రభుత్వ అభ్యర్థన మేరకే తొలగించడం జరిగిందని ఆ నివేదిక వెల్లడించింది. "ట్విటర్తో సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం మీద వచ్చే కీలక వ్యాఖ్యలను అది అణచివేస్తోంది. పూర్తిగా తొలగిస్తోంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం" అని ఇటీవల మాస్టొడాన్ వేదికకు మారిపోయిన రచయిత నీలాంజన రాయ్ అన్నారు.
ఏమిటీ మాస్టొడాన్?
ఇదికూడా యూజర్లు పోస్టులు, కామెంట్స్ చేసుకుంటూ ఫాలో అవడానికి వీలు కల్పించే సంప్రదాయిక వేదికే. ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే, ఏక కేంద్రంగా పనిచేయదు. వికేంద్రీకృతంగా, ఓపెన్ సోర్స్లా పని చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఏ ఒక్కరి ఆధిపత్యం కింద నడిచే వ్యవస్థ కాదు. ఇందులో యూజర్లు సొంత సర్వర్లు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవచ్చు. అంటే, ఇది విభిన్న వ్యక్తులు ఏర్పాటు చేసిన సోషల్ నెట్వర్క్ అన్నమాట. ప్రతిదానికీ సొంత నియమాలు, నిబంధనలు ఉంటాయి. దీనివల్ల, యూజర్లు తమ భావజాలానికి, విధానాలకు అనువుగా ఉందని భావించే సర్వర్ను ఎంచుకునే వీలుంటుంది. యూగెన్ రోచ్కో అనే సాఫ్ట్వేర్ సంస్థ 2016 అక్టోబర్ మాస్టొడాన్ను విడుదల చేసింది. 2017 నుంచి అది విస్తరించడం మొదలైంది. తమకు 22 లక్షల మంది యూజర్లు ఉన్నారని సంస్థ చెప్పుకుంటోంది. 32.1 కోట్ల యూజర్లు ఉన్న ట్విటర్తో పోల్చితే అది చాలా చిన్నది.
అయితే, ట్విటర్కు మాస్టొడాన్ మంచి ప్రత్యామ్నాయమని చాలా మంది చెబతున్నారు. కానీ, మరికొందరు మాత్రం అది దాన్ని ఉపయోగించడం ట్విటర్ అంత అనువుగా ఉండదని అంటున్నారు. అది ట్విటర్ను దీర్ఘకాలంలోనైనా దాటిపోయే అవకాశాలు లేవని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరేమో, 'ట్విటర్ను వదిలేయండి' అనే ఈ ఉద్యమం మఖలో పుట్టి పుబ్బలో అంతరించిపోయేదేనని అంటున్నారు. ఆ ప్రత్యామ్నాయ వేదికకు తనదైన ముద్ర వేసేంతటి శక్తి లేదని చెబుతున్నారు.
తాజా వార్తలు
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!