పాక్ చెరలో ఉన్న ప్రశాంత్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

- November 20, 2019 , by Maagulf
పాక్ చెరలో ఉన్న ప్రశాంత్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

 

పాకిస్తాన్‌ చెరలో ఉన్న ప్రేమికుడు ప్రశాంత్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతన్ని చాలాకాలం క్రితమే పాక్‌లోకి పట్టుకున్నారా? ఈ విషయం కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు ముందే తెలుసా? ఔననే సమాధానం వినిపిస్తోంది. ఏడు ఎనిమిది నెలల క్రితమే కొందరు హైదరాబాద్‌కు వచ్చి, ప్రశాంత్ తల్లిదండ్రులను కలిసిన విషయం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ప్రశాంత్ 2017 ఏప్రిల్ 11న అదృశ్యమయ్యాడు. 29న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ లభించకపోవడంతో కేసు మూసేశారు. 7, 8 నెలల క్రితం ఇద్దరు అపరిచితులు ప్రశాంత్ అన్నయ్యను కలిసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత విశాఖలో అతని తండ్రిని సైతం కలిశారు. ప్రశాంత్ ఎక్కడున్నాడు? ఎప్పటి నుంచి కనిపించకుండా పోయాడు? ఏం చేసేవాడు? అంటూ హిందీలో ఆరా తీశారు.

ప్రశాంత్ గురించి కుటుంబ సభ్యులను ఆరా తీయడం ఆ తర్వాత కూడా కొనసాగింది. నెల రోజుల తర్వాత మరొకరు వచ్చారు. పాత ప్రశ్నలనే మరోసారి అడిగారు. దీంతో.. ప్రశాంత్ తండ్రి మీరెవరని అడగ్గా.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారట. ఈ విషయాన్ని అప్పట్లోనే మాదాపూర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రశాంత్ కుటుంబసభ్యులు తెలిపారు. అయితే.. దౌత్య కార్యాలయం నుంచి మీకు ఫోన్‌కాల్ వస్తుందంటూ పోలీసులు చెప్పారన్నారు.

ప్రశాంత్ తండ్రి బాబూరావు విశాఖపట్నంలో ప్రైవేట్ ఉద్యోగి. 2014లో కుటుంబం హైదారాబాద్‌కు మారింది. బీటెక్‌ చేసిన ప్రశాంత్ కొన్నాళ్లు బెంగళూరులో ఉద్యోగం చేశాడు. అక్కడే మధ్యప్రదేశ్‌కు చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తర్వాత మాదాపూర్‌లోని కంపెనీలో చేరాడు. ప్రేమ విఫలం కావడంతో ప్రశాంత్‌ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమె కోసం వెళ్లి దారితప్పి.. పాకిస్తాన్‌లోకి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు.

మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రశాంత్ ఇంట్లోంచి వెళ్లిపోయేటప్పుడు తనతో ఏమీ తీసుకెళ్లలేదు. పర్సు, ఐడీ కార్డులు, అన్నీ ఇంట్లోనే వదిలేశాడు. పాస్‌పోర్టు కూడా అతనితో లేదని, ఇక్కడ ఉన్నప్పుడే పోయిందని గుర్తుచేస్తున్నారు. పాకిస్తాన్‌లోని అక్రమంగా చొరబడాల్సిన అవసరం అతనికి ఏమాత్రం లేదని కుటుంబసభ్యుల అభిప్రాయం. ఎలాంటి గొడవల్లో తలదూర్చేవాడు కాదని, అక్రమ వ్యాపారాలు లేవని చెప్తున్నారు. ప్రశాంత్‌ను క్షేమంగా విడిపించేందుకు సహకరించాలని ఆయన తండ్రి బాబూరావు వేడుకుంటున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com