మెట్రో రైల్‌ ప్రాజెక్టును గన్నవరం విమానాశ్రయం వరకు విస్తరించనున్నారు

- February 17, 2016 , by Maagulf
మెట్రో రైల్‌ ప్రాజెక్టును గన్నవరం విమానాశ్రయం వరకు విస్తరించనున్నారు

విమానయాన సూచనకు మున్సిపల్‌ శాఖ ఓకే రెండో దశలో విస్తరణకు ప్రాధాన్యం విపత్తు నిర్వహణ ప్రాథమిక స్థాయిలోనే మెట్రోరైల్‌ ఎమర్జెన్సీ ద్వారాలు మార్చండి స్మార్ట్‌కార్డుల ద్వారానే ఉద్యోగుల ప్రవేశం విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై ఐబీ, హోం శాఖల సూచనలు ఏపీ రాజధాని ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న మెట్రో రైల్‌ ప్రాజెక్టును గన్నవరం విమానాశ్రయం వరకు విస్తరించనున్నారు. కేంద్ర విమానయాన శాఖ సూచనల మేరకు మెట్రో ప్రాజెక్టును విమానాశ్రయం వరకు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే, మెట్రో రెండో దశలో దీనిని చేపడతామని మున్సిపల్‌ శాఖ స్పష్టం చేసింది. మరోపక్క, మెట్రోరైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌పై కేంద్ర హోం శాఖ, ఐబీ, రైల్వే, పౌరవిమానయాన శాఖలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అలాగే, ప్రాజెక్టును మరింత మెరుగుపర్చేందుకు పలు సూచనలు చేశాయి. అభ్యంతరాలు/సూచనలు ఇవీ.. మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌లో విపత్తు నిర్వహణ చర్యలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని కేంద్ర ఐబీ, హోం శాఖలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఏదైనా విపత్తు సంభవిస్తే మెట్రో స్టేషన్లలో, టన్నెల్స్‌లో, ట్రాక్‌పై తీసుకోవాల్సిన ప్రత్యేకమైన చర్యల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొన్నాయి. ప్రతి స్టేషన్లోను ఎక్స్‌రాట్‌ మెషీన్లు, డీఎఫ్‌ఎండీలను ఏర్పాటు చేయడానికి విశాలమైన ప్రదేశాలు ఉండేలా డిజైన్లు సిద్ధం చేయాలని, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే సమయంలో వీలైనన్ని ఎక్కువ మెషిన్లతో తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించాయి. తొక్కిసలాట జరగకుండా కారిడార్లు, మెట్లు, ర్యాంపులను విశాలంగా నిర్మించాలని, ప్రవేశం, బయటకి వెళ్లే దారులు వేర్వేరుగా ఉండాలని, మహిళా ప్రయాణికులను తనిఖీ చేసేందుకు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించాయి. అత్యవసర ద్వారాల ఏర్పాటుపై పోలీసుల అభిప్రాయం తప్పనిసరని ఐబీ, హోంశాఖలు తెలిపాయి. మెట్రో స్టేషన్లు, ఆపరేషన కంట్రోల్‌ సెంటర్లు, డిపోలు, రిసీవింగ్‌ సబ్‌ స్టేషన్లలో ఐఈడీ(ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌)లను అమర్చేందుకు అనువైన ప్రదేశాలు, నిర్మాణాలు లేకుండా జాగ్రత్తపడాలని, చెత్తడబ్బాలు కూడా పారదర్శకంగా ఉండాలని హోం శాఖ సూచించింది. మెట్రోరైలు నుంచి ప్రయాణికులు దిగడానికి డీపీఆర్‌లో సూచించిన పద్ధతిపై ఐబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతి క్యాబిన మధ్యలోనూ ఎమర్జెన్సీ ద్వారం ఏర్పాటు చేయాలని డీపీఆర్‌లో పేర్కొన్నారు. అయితే, మెట్రో రైళ్లలో ఉండే విద్యుత సరఫరా విధానం మూలంగా.. ఎమర్జెన్సీ ద్వారాలను క్యాబిన మధ్యలో ఏర్పాటు చేయడం తీవ్ర ప్రమాదకరమని ఐబీ అభిప్రాయపడింది. బ్యాకప్‌ కంట్రోల్‌ సెంటర్‌(బీసీసీ) గురించి డీపీఆర్‌లో ప్రస్తావించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సీసీటీవీల నిఘా స్టేషనలోని ప్రతీ అంగుళాన్ని కవర్‌ చేయాలని, 90 రోజుల రికార్డింగులు అందుబాటులో ఉండాలని సూచించాయి. కాగా, మెట్రోరైల్‌ ప్రాజెక్టు పరిధిలో అనేక రైల్వే స్టేషన్లు ఉన్నందున దక్షిణ మధ్య రైల్వే అనుమతులు తీసుకోవాలని రైల్వే సూచించింది. రాష్ట్రం స్పందన ఇదీ.. కేంద్ర శాఖల నుంచి వచ్చిన అభ్యంతరాలపై రాష్ట్ర మున్సిపల్‌ శాఖ వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. ఈ వివరణలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు కోసం పీఐబీ(పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు) అనుమతులు వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరింది. ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక డిజైనలో ప్రత్యేక విపత్తు నిర్వహణ చర్యలు స్పష్టంగా పేర్కొంటామని మున్సిపల్‌ శాఖ తెలిపింది. మెట్రో స్టేషన్లలో ఒక్కోషిఫ్టుకి 8 మంది భద్రతా సిబ్బంది ఉంటారని, భద్రత కోసమే రూ.8.47 కోట్లు కేటాయించామని, ఈ బాధ్యతలను ఏపీ పోలీస్‌కే అప్పగిస్తామని మున్సిపల్‌ శాఖ వివరించింది. మెట్రోప్రాజెక్టుపై కేంద్ర శాఖలు చేసిన సూచనలను ప్రాజెక్టు అమలు సమయంలో పాటిస్తామని తెలిపింది. మెట్రో రైలు అనుమతుల కోసం దక్షిణ మధ్యరైల్వే(ఎస్‌సీఆర్‌)కు దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. నెరవేరనున్న సీఎం ఆకాంక్ష విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ను మెట్రో, రైల్‌, రోడ్డు, జల రవాణా మార్గాలను అనుసంధానిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించిన నేపథ్యంలో నిడమానూరు కారిడార్‌ను ఎయిర్‌పోర్ట్‌ వరకు విస్తరించాలని పౌర విమానయాన శాఖ సూచించింది. అంటే, మరో 8.5 కిలోమీటర్ల మేర విస్తరించాలని తెలిపింది. మెట్రో ప్రాజెక్టు రెండో దశలో ఎయిర్‌పోర్ట్‌ వరకు విస్తరించే యోచనలో ఉన్నామని మున్సిపల్‌ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com