ప్రపంచ టేబుల్ టెన్నిస్ లో భారత జట్ల శుభారంభం..

- February 28, 2016 , by Maagulf
ప్రపంచ టేబుల్ టెన్నిస్ లో భారత జట్ల శుభారంభం..

టీటీ ప్రపంచ చాంపియన్‌షిప్ కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. గ్రూప్-ఎఫ్ రెండో డివిజన్ తొలి రౌండ్‌లో భారత పురుషుల జట్టు 3-0తో వియత్నాంపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో ఆడిన ఆచంట శరత్ కమల్ 11-8, 11-6, 5-11, 11-6తో టు నగుయెన్‌పై నెగ్గాడు. రెండో సింగిల్స్‌లో ఆంథోని అమల్‌రాజ్ 12-10, 11-5, 11-6తో టియాన్ డాట్ లీని ఓడించడంతో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో సింగిల్స్‌లో హర్మిత్ దేశాయ్ 11-5, 13-11, 12-10తో బా యువాన్ అన్ డొయాన్‌పై గెలవడంతో భారత్ 3-0తో నెగ్గింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో తొలుత టర్కీతో, అనంతరం నైజీరియాతో భారత్ ఆడుతుంది.రెండో డివిజన్‌లో మొత్తం 24 జట్లు నాలుగు గ్రూప్‌లుగా బరిలోకి దిగుతున్నాయి.ప్రతి గ్రూప్‌లో జట్టు.. మిగతా టీమ్‌లతో రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ టాపర్లు రెండో దశకు అర్హత సాధిస్తారు. గ్రూప్ 'జి'లో భారత మహిళల జట్టు తొలి రౌండ్‌లో 3-0తో కొలంబియాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో మౌమా దాస్ 11-2, 12-10, 11-2తో పౌలా మెదీనాపై, రెండో సింగిల్స్‌లో మణికా బాత్రా 11-5, 11-5, 11-4తో లేడీ రువానోపై, మూడో సింగిల్స్‌లో 11-4, 11-8, 11-3తో లుసా జులుఆగాపై గెలిచారు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో తొలుత ప్యుర్టోరికో, ఆ తర్వాత పోర్చుగల్‌తో భారత్ ఆడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com