భారత్ తో పాటు 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్ పొడిగింపు

- July 19, 2021 , by Maagulf
భారత్ తో పాటు 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్ పొడిగింపు

యూఏఈ: భారత్ తో సహా దక్షిణాసియా దేశాల నుంచి యూఏఈ వెళ్లాలనుకునేవారు మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. దీంతో భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇండోనేషియా, లైబీరియా, నమీబియా, నేపాల్, నైజీరియా, పాకిస్తాన్, ఉగాండా, సియెర్రా లియోన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వియత్నాం, జాంబియా నుంచి యూఏఈకి ఫ్లైట్ సర్వీసుల రద్దు కంటిన్యూ కానుంది. దక్షిణాది దేశాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామని, దేశ పౌరుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రావెల్ ప్రోటోకాల్ పై యథాతథ స్థితిని కొనసాగించేందుకే నిర్ణయించామని డీసీఏఏ స్పష్టం చేసింది. అంటే నిషేధ జాబితాలో ఉన్న 16 దేశాల నుంచి దౌత్యవేత్తలు, మెడికల్ ఎమర్జెన్సీ ప్రయాణికులకు మినహా ఇతరులకు ప్రయాణం నిషేధం.

కోవిడ్ సెకండ్ వేవ్ పరిణామాల తర్వాత భారత్ నుంచి తమ దేశానికి ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసింది యూఏఈ. గత ఏప్రిల్ నుంచి ట్రావెల్ బ్యాన్ కంటిన్యూ చేస్తోంది. అయితే..విమానాల రద్దుతో భారత్ లోనే చిక్కుకుపోయిన ప్రవాసీయులు..తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు ఎప్పుడెప్పుడు ట్రావెల్ బ్యాన్ ఎత్తివేస్తారా అని ఎదురుచూస్తున్నారు. భారత విదేశాంగ శాఖ కూడా ఫ్లైట్ సర్వీసుల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గల్ఫ్ కంట్రీస్ లోని రాయబారులకు కూడా విమాన ప్రయాణాలు సాధారణ స్థాయికి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేయాలంటూ సూచనలు చేసింది. దీంతో యూఏఈ నుంచి సానుకూల ప్రకటన వస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ప్రవాసీయుల ఆశలపై నీళ్లు చల్లుతూ యూఏఈ విమానాల రద్దుపై యథాతథ స్థితినే కొనసాగించాలని నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com