ఆధార్‌కు చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం..

- March 11, 2016 , by Maagulf
ఆధార్‌కు చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం..

ఆధార్‌కు చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్‌ బిల్లుకు శుక్రవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆధార్‌ చట్టబద్ధతపై ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆధార్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ దానిపై వివరణ ఇచ్చారు. దేశంలో 97 శాతం మంది ఆధార్‌ కార్డు కలిగి ఉన్నారని తెలిపారు. ఆధార్‌ ద్వారా నమోదైన బయోమెట్రిక్‌ సమాచారం ఎవరితోనూ పంచుకోమని, అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. ఇకపై కేంద్ర ప్రభుత్వ రాయితీలన్నీ ఆధార్‌ అనుసంధానం ద్వారానే లబ్ధిదారులకు అందించనున్నాయి.పౌరసత్వ, స్థానిక హక్కులు మాత్రం ఆధార్‌తో ముడిపడి ఉండవని గతంలోనే జైట్లీ స్పష్టంచేశారు. ప్రత్యక్ష నగదు బదిలీ విషయంలో ఎల్పీజీ రాయితీ(డీబీటీఎల్‌)ని అందించే పహల్‌ పథకానికి ఇప్పటికే ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఎరువుల రాయితీని ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రైతులకు అందించేందుకు, చౌక దుకాణాలను ఆటోమేషన్‌ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.వాస్తవానికి కేంద్ర పథకాల నుంచి లబ్ధి పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం గతంలోనే యత్నించింది. అయితే ఆధార్‌ చట్టబద్ధత, గోప్యతపై సుప్రీంకోర్టు సంశయాలు లేవనెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఆధార్‌కు శాసన హోదా కల్పిస్తూ పార్లమెంటులో బిల్లును ఆమోదించి ప్రభుత్వం దానిని చట్టబద్ధం చేసింది. 2016 ఫిబ్రవరి 29 నాటికి మొత్తం దేశ జనాభా 131.71 కోట్లు, జారీ అయిన ఆధార్‌ కార్డులు 98కోట్లు, మొత్తం డీబీటీఎల్‌ ఖాతాలు 16.5కోట్లు, ఆధార్‌తో అనుసంధానమైనవి 11.19కోట్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com