ప్రకాశ్రాజ్ సమాజంలో అందరికీ స్పూర్తిదాత
- March 26, 2016
గ్రామజ్యోతి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహబూబ్నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రసిద్ధ సినీ నటుడు ప్రకాశ్రాజ్ సమాజంలో అందరికీ స్పూర్తిదాతగా పేర్కొంటూ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రశంసించారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ప్రకాశ్రాజ్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను దత్తత తీసుకున్న కొండారెడ్డిపల్లిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రకాశ్రాజ్ కలెక్టర్కు వివరించారు. కొండారెడ్డిపల్లిలో విద్యాభివృద్ధి కోసం ప్రస్తుతం ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణం అవసరమని, అదేవిధంగా విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామంలో మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడికతీత, పాడుబడిన బావులను పూడ్చడం, ఇంకుడుగుంతల నిర్మాణం తదితర అభివృద్ధి, నిర్మాణాత్మక కార్యక్రమాల కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్కు వివరించారు.ప్రభుత్వ యంత్రాంగం ఈమేరకు తమకు సహకరించాలని ఆయన కోరారు. ప్రధానంగా పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్థులు స్థానికంగా చదువుకునే ఆస్కారం ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకుని గ్రామస్తుల విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుధ్యం, పౌష్టికాహారం, సహజ వనరుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలతో గ్రామాభివృద్ధికి ప్రణాళికా బద్దంగా కృషి చేస్తున్న ప్రకాశ్రాజ్ను సమాజంలో అందరూ స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. జిల్లాలో అక్షరాస్యత తక్కువగా ఉండటం, బాల్యవివాహాలు, మద్యపానం, సామాజిక అంశాలపై అవగాహన లోపం తదితర సాంఘిక దురాచారాలు ఉన్నాయని, వీటి నిర్మూలనకు అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రకాశ్రాజ్ స్పూర్తితో జిల్లాలోని వివిధ గ్రామాలను దత్తత తీసుకుని గ్రామీణాభివృద్ధికి పాటుపడేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కమ్మదనంలో బోరు మోటారును ప్రారంభించిన ప్రకాశ్రాజ్.. ఫరూక్నగర్ మండలంలోని కమ్మదనం గ్రామంలో నెలకొన్న మంచినీటి ఎద్దడిపై స్పందించి ఇటీవల ప్రకాశ్రాజ్ తన పేరునగల ఫౌండేషన్ నిధులతో బోరు వేయించి, శుక్రవారం మోటారును స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావం కారణంగా భూగర్భజలాలు అడుగంటిన నేపథ్యంలో గ్రామస్తులు ప్రతి నీటి బొట్టును వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు ప్రతి ఇంటిముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భజలం పెరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









