దిశా ఎన్కౌంటర్లో సుప్రీం సంచలన తీర్పు
- May 20, 2022
న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన దిశా ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రంగారెడ్డి జిల్లా చటన్ పల్లిలో 2019 డిసెంబర్ లో జరిగిన దిశా అత్యాచార, హత్య ఘటనలో నలుగురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండగానే పారిపోయేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈఘటనలో నలుగురు నిందితులు హతమయ్యారు. కాగా, నిందితులను పోలీసులే ఎన్కౌంటర్ చేశారంటూ మానవహక్కుల సంఘాలు, ఇతర ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయింది. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ సిర్పూర్ కర్ కమిషన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ జరిపారు. అనంతరం ఈ ఏడాది జనవరిలోనే కమిషన్ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించగా..ఆమేరకు నేడు జరిగిన విచారణలో కీలక తీర్పు వెలువరించింది సుప్రీం ధర్మాసనం. దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణను తెలంగాణ హై కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.
కమిషన్ నివేదికను హై కోర్టుకు పంపాలని, జస్టిస్ సిర్పూర్ కర్ కమిషన్ నివేదికను ఇరుపక్షాల పిటిషన్ దారులకు అందజేయాలని సుప్రీం ఆదేశించింది. నివేదికపై ఇరుపక్షాలు తమ వాదనలు హైకోర్టులో వినిపించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ ఎన్కౌంటర్ ఘటనలో పాల్గొన్న 10 మంది పోలీసు అధికారులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఈ నేరానికి పాల్పడ్డారని, వీరిపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించింది.
కేసుకు సంబంధించిన అన్ని వివరాలను హైకోర్టుకు బదిలీ చేయాలని కోర్టు తెలిపింది. కాగా, అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశంతో కాల్పులు జరిపారని సిర్పూర్కర్ కమిషన్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ ఎన్కౌంటర్ ఘటనలో కమిషన్ విచారణ నివేదికను సీల్డ్ కవర్ లోనే ఉంచాలన్న ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యర్థనను సుప్రీంకోర్టు గతంలోనే తోసిపుచ్చింది. ఎన్కౌంటర్ ఘటనలో దోషులను కమిషన్ గుర్తించిందన్న సుప్రీం కోర్టు, ఇందులో దాచాల్సింది ఏమి లేదని, విచారణ మొత్తం బహిరంగంగానే జరిగిందని పేర్కొంది. ఇది పబ్లిక్ ఎంక్వయిరి..కావునా నివేదికలోని అంశాలను బయటకు వినిపిస్తామని కోర్టు స్పష్టం చేసింది. కాగా దిశా ఎన్కౌంటర్ కేసు విచారణను హై కోర్టుకు బదిలీ చేసిన అనంతరం ఇకపై సుప్రీంకోర్టు మానిటరింగ్ చేయదని ధర్మాసనం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి







