ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు 28 లక్షల మంది

- August 04, 2022 , by Maagulf
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు 28 లక్షల మంది

న్యూ ఢిల్లీ: గడిచిన రెండున్నరేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం 28 లక్షల మందికి పైగా భారత పౌరులు విదేశాలకు వెళ్లారని తెలిపింది కేంద్రం.జనవరి 2020-జూలై 2022 వరకు డాటాను కేంద్రం తాజాగా వెల్లడించింది.లోక్‌సభలో కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం 2020లో 7.15 లక్షల మంది, 2021లో 8.33 లక్షల మంది విదేశాలకు వెళ్లగా, ఈ ఏడాది జూలై చివరి వరకు దాదాపు 13.02 లక్షల మంది విదేశాలకు వెళ్లారు.

విదేశాలకు వెళ్లే పౌరుల వీసాలు, లేదా వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ డాటా సేకరించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లలో విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లిన వారి సంఖ్య తక్కువగా ఉంది. విదేశాలకు వెళ్లిన వారిలో 4.16 లక్షల మంది ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) కంట్రీస్‌కే వెళ్లారు.వీరిలో అత్యధికంగా అంటే 1.31 లక్షల మంది ఉత్తర ప్రదేశ్ నుంచి, తర్వాత 69,518 మంది బిహార్ నుంచి వెళ్లారు.కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం… 17 దేశాలకు ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం. ఆ దేశాలు.. అఫ్ఘనిస్తాన్, బహ్రైన్, ఇరాక్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కువైట్, జోర్డాన్, లిబియా, లెబనాన్, మలేసియా, ఒమన్, ఖతార్, సూడాన్, సిరియా, థాయ్‌లాండ్, యూఏఈ, యెమెన్. ఈ దేశాలకు వెళ్లేందుకు కచ్చితమైన క్లియరెన్స్ అవసరం.

అయితే, విదేశీయులను తమ దేశాలకు అనుమతించే విషయంలో మాత్రం ఆ దేశాలు అంత కఠినంగా వ్యవహరించడం లేదు.అలాగే ఆ దేశాలకు వెళ్లిన పౌరులకు సంబంధించిన సమాచారం కూడా అక్కడ అంత సులభంగా దొరకదు.త్వరగా సమస్యల పరిష్కారం కూడా ఉండదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com