కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలి: WHO

- December 31, 2022 , by Maagulf
కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలి: WHO

జెనీవా: కరోనా విషయంలో వాస్తవాలను వెల్లడించాలంటూ చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘేబ్రియేసస్ మరోమారు విజ్ఞప్తి చేశారు. మూడేళ్లుగా ఈ మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతోందని, ఈ వైరస్ విషయంలో అబద్ధాలను ప్రచారం చేయొద్దని కోరారు. ఈమేరకు చైనా ఉన్నతాధికారులతో కూడిన ప్రతినిధి బృందంతో ఘేబ్రియేసస్ తాజాగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనాలో ప్రస్తుత పరిస్థితిని ప్రపంచానికి వెల్లడించాలని ఆయన కోరారు.

వైరస్ వ్యాప్తికి సంబంధించిన వివరాలు, జెనెటిక్ సీక్వెన్సింగ్, కరోనాతో ఆసుపత్రులకు చేరిన వాళ్ల సంఖ్య, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న వాళ్లు ఎంతమంది, కరోనా మరణాలు, వ్యాక్సినేషన్ లెక్కలు.. తదితర వివరాలను ప్రపంచానికి వెల్లడించాలని ఘేబ్రియేసస్ కోరారు. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో వైరస్ వేరియంట్ల పరిశీలన, వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న చికిత్స, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని చెప్పారు.

కరోనాకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో కలిసి పనిచేయాలంటూ చైనా శాస్త్రవేత్తలకు ఘేబ్రియేసస్ పిలుపునిచ్చారు. వైరల్ సీక్వెన్సింగ్ పై జనవరి 3న నిర్వహించబోయే సమావేశంలో పాల్గొనాలని కోరారు. తమ దేశంలో వైరస్ వ్యాప్తి, ప్రజారోగ్యంతో పాటు మిగతా వ్యవస్థలపై మహమ్మారి ప్రభావానికి సంబంధించిన వివరాలను ఈ సమావేశంలో పంచుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com