యెమెన్‌లో ఘోర విషాదం .. తొక్కిసలాటలో 85 మంది మృతి

- April 20, 2023 , by Maagulf
యెమెన్‌లో ఘోర విషాదం .. తొక్కిసలాటలో 85 మంది మృతి

యెమన్‌లో ఘోర విషాదం జరిగింది. ఓ ఛారిటీ పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 85 మందికి పైగా మరణించగా, వందలాది మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

వివరాల ప్రకారం.. యెమెన్‌ రాజధాని సనాలోని ఓ పాఠశాలలో ఛారిటీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొందరు వ్యాపారులు నగదు పంపిణీ చేస్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 85 మందికి పైగా మరణించగా, 322 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు హుతీ అంతర్గత మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అన్నారు. తొక్కిసలాటకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై హొవిచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్టు హుతీ రాజకీయ చీఫ్‌ మహదీ అల్‌-మషత్‌ తెలిపారు. 

యెమెన్‌లో ఎనిమిదేళ్లకు పైగా జరిగిన అంతర్యుద్ధం ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. 2014లో ఇరాన్‌-మద్దతు గల హుతీ తిరుగుబాటుదారులు సనాను స్వాధీనం చేసుకోవడంతో వివాదం ప్రారంభమైంది. హొఅంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సౌదీ నేతృత్వంలోని  సంకీర్ణ ప్రభుత్వం  జోక్యం చేసుకోవలసి వచ్చింది. అక్కడి జనాభాలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com