మాజీ ఇండియన్ నేవీ అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష..
- October 26, 2023
దోహా: దోహాలో భారత్కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు కొన్ని నెలల నుంచి ఖతార్ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వీరికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది.
గూఢచర్యం ఆరోపణలపై వీరికి ఈ శిక్ష పడినట్లు సమాచారం.ఎనిమిది మంది భారతీయులకు మరణశిక్ష పడినట్లు వార్తలు రావడం పై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ వార్త తమనెంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని.. దీని పై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది.
'నేవీ మాజీ అధికారులకు ఖతర్ కోర్టు మరణశిక్ష విధించిందన్న విషయం దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ తీర్పునకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వేచిచూస్తున్నాం. బాధితుల కుటుంబ సభ్యులతోపాటు న్యాయ బృందంతో అందుబాటులో ఉన్నాం.చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాల కోసం అన్వేషిస్తున్నాం.ఈ కేసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం.ఈ తీర్పునకు సంబంధించిన విషయాన్ని ఖతార్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం' అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. గోప్యతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ఈ కేసుపై ప్రస్తుతం ఎక్కువగా వ్యాఖ్యానించలేమని తెలిపింది.
భారత్కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు. అయితే, భారత్కు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతార్ అధికారులు ఆగస్టు 2022లో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించినట్లు తెలిసింది.
అయితే, వీరంతా భారత అధికారులతో మాట్లాడేందుకు ఖతార్ అనుమతి ఇచ్చింది. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు కలవడంతోపాటు ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో పలుమార్లు బెయిల్కు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వీరి నిర్బంధాన్ని ఖతార్ ప్రభుత్వం పొడిగించింది. చివరకు ఈ కేసు కోర్టులో విచారణకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఎనిమిది మందికి తాజాగా అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







