కేరళ ప్రార్థనా సమావేశంలో పేలుళ్లు

- October 29, 2023 , by Maagulf
కేరళ ప్రార్థనా సమావేశంలో పేలుళ్లు

కేరళ: దక్షిణ భారతదేశంలోని కేరళలో  ప్రార్థనా సమావేశంలో పేలుళ్లు జరిగాయి. ఇందులో ఒక మహిళ మరణించగా.. 36మంది తీవ్రంగా గాయపడ్డారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈ ఘటనను దిగ్భ్రాంతికరమని , దురదృష్టకరమని పేర్కొన్నారు. యెహోవాసాక్షుల హాలులో పేలుడు జరిగింది. కేరళలోని కొచ్చి సమీపంలోని కలమస్సేరిలో జరిగిన పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.  ఈ ప్రమాదంలో గాయపడ్డ పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం ప్రార్థనా సమావేశంలో కలమస్సేరిలోని ఒక కన్వెన్షన్ సెంటర్‌లో కనీసం మూడు పేలుళ్లు జరిగినట్లు స్థానిక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పి.వి. బేబీ తెలిపారు. మూడు రోజుల ప్రార్థన సమావేశాలలో సుమారు 2,500 మంది వ్యక్తులు పాల్గొన్నారని వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు తానే బాధ్యుడిని అంటూ డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయారు.  యెహోవాసాక్షులు 19వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉద్భవించిన క్రైస్తవ మత సమూహం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com