నేపాల్ భూకంపం ఎఫెక్ట్…128కి పెరిగిన మృతుల సంఖ్య

- November 04, 2023 , by Maagulf
నేపాల్ భూకంపం ఎఫెక్ట్…128కి పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్ దేశంలో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం అర్థరాత్రి నేపాల్‌లోని జాజర్‌కోట్ జిల్లాలో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 128 మంది మరణించారు. పశ్చిమ నేపాల్‌లోని జాజర్‌కోట్, రుకుమ్ జిల్లాల్లో 128 మంది మరణించారు. ఈ భూకంపం వల్ల మరో 140 మందికి పైగా గాయపడ్డారు. జాజర్‌కోట్‌లోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప కొలత కేంద్రం అధికారులు తెలిపారు.

క్షతగాత్రులను తక్షణమే రక్షించేందుకు, సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు దేశంలోని మూడు భద్రతా ఏజెన్సీలను సమీకరించినట్లు నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ కార్యాలయం తెలిపింది. దైలేఖ్, సల్యాన్, రోల్పా జిల్లాలతో సహా ఇతర జిల్లాల నుంచి కూడా క్షతగాత్రులు, ఆస్తి నష్టం నివేదికలు వస్తున్నాయని దేశ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.గాయపడిన వ్యక్తులు ఖాట్మండుకు పశ్చిమాన 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజర్‌కోట్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

హిమాలయ దేశమైన నేపాల్‌లో భూకంపాలు సర్వసాధారణంగా సంభవిస్తుంటాయి. శుక్రవారం సంభవించిన భూకంపం అత్యంత బలమైనది. నేపాల్ దేశంతోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను భూ ప్రకంపనలు వణికించాయి. ఒక సంవత్సరం క్రితం దోటి జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి ఆరుగురు మరణించారు. దేశాన్ని కుదిపేసిన వరుస భూకంపాలలో ఇది ఒకటి. 2015వ సంవత్సరంలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 12,000 మందికి పైగా మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com