మోదీ ఐదు దేశాల పర్యటన కు బయలుదేరనున్నారు...
- June 03, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఐదు దేశాల పర్యటనకు బయలుదేరనున్నారు.
ఆయన అఫ్గనిస్థాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల్లో పర్యటించనున్నారు. ఆయా దేశాలతో వాణిజ్య, ఇంధన, భద్రతా సహకారాన్ని విస్తృతం చేసుకోవటంపై ఆయన దృష్టి కేంద్రీకరించనున్నారు. 48 మంది సభ్యులతో కూడిన అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి మద్దతివ్వాలని స్విట్జర్లాండ్, మెక్సికోను అభ్యర్థించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో జూన్ 7న జరిగే సమావేశంలోనూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించొచ్చు. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ మే 12న లాంఛనంగా దరఖాస్తు చేసుకుంది. స్విట్జర్లాండ్ అధ్యక్షుడితో చర్చల్లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం అంశాన్నీ మోదీ ప్రస్తావించే అవకాశముంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ.. ముందుగా అఫ్గనిస్థాన్కు వెళ్తారు. శనివారం అఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో కలిసి అఫ్గన్ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్(సల్మా డ్యామ్)ను ప్రారంభిస్తారు. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితితో పాటు పలు అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ డ్యామ్ అఫ్గన్భారత్ స్నేహానికి చిహ్నమని.. ఇది హెరత్లోని పంట పొలాలకు జీవం అందించటంతో పాటు ఆ ప్రాంత ప్రజలకు సౌభాగ్యాన్ని కలిగిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. అక్కడ్నుంచి ప్రధాని మోదీ చమురు సమృద్ధ దేశం ఖతార్కు వెళ్తారు. ఆ దేశ ప్రధానమంత్రి, ఇతర నేతలతో చర్చలు జరుపుతారు. రెండు దేశాల ప్రజల మధ్య బలంగా నాటుకున్న చరిత్రాత్మక స్నేహాన్ని తన పర్యటన పరిపుష్టం చేయగలదని మోదీ ఆకాక్షించారు. ఆయన అక్కడ్నుంచి ఆదివారం నాడు రెండు రోజుల పర్యటన కోసం స్విట్జర్లాండ్కు బయలుదేరతారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవటానికి తాను స్విస్ అధ్యక్షుడు ష్నీదర్అమ్మన్తో చర్చలు జరుపుతానని మోదీ తెలిపారు. అక్కడి ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు సెర్న్లో భారతీయ శాస్త్రవేత్తలనూ కలుసుకుంటానని వెల్లడించారు. స్విట్జర్లాండ్ నుంచి మోదీ జూన్ 6న వాషింగ్టన్కు వెళ్తారు. అధ్యక్షుడు ఒబామా కోరిక మేరకు అమెరికాలో పర్యటించనున్న మోదీ.. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలోనూ ప్రసంగిస్తారు. ఇలాంటి అవకాశం దక్కినవారిలో మోదీ ఐదో భారతీయ ప్రధానమంత్రి. ఆర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీలో నివాళుల అర్పించటంతో మోదీ అమెరికా పర్యటన ఆరంభమవుతుంది. అనంతరం ఆ దేశ మేధావులతో భేటీ అవుతారు. యూఎస్ఐబీసీ 40వ వార్షిక సమావేశంలోనూ ప్రసంగిస్తారు. జూన్ 7న అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ కానున్నారు. వివిధ రంగాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవటంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. మోదీ అమెరికా నుంచి జూన్ 8న మెక్సికోకు చేరుకుంటారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలు, ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మద్దతు కోరటం వంటి పలు అంశాలపై మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటోతో చర్చలు జరుపుతారు. 1986లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తర్వాత జరుగుతున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జీ20 సదస్సులో పాల్గొనటానికి మెక్సికోను సందర్శించారు. ప్రధానమంత్రి మోదీ జూన్ 8న సాయంత్రం తిరిగి భారత్కు బయలుదేరతారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







