మోదీ ఐదు దేశాల పర్యటన కు బయలుదేరనున్నారు...
- June 03, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఐదు దేశాల పర్యటనకు బయలుదేరనున్నారు.
ఆయన అఫ్గనిస్థాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల్లో పర్యటించనున్నారు. ఆయా దేశాలతో వాణిజ్య, ఇంధన, భద్రతా సహకారాన్ని విస్తృతం చేసుకోవటంపై ఆయన దృష్టి కేంద్రీకరించనున్నారు. 48 మంది సభ్యులతో కూడిన అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి మద్దతివ్వాలని స్విట్జర్లాండ్, మెక్సికోను అభ్యర్థించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో జూన్ 7న జరిగే సమావేశంలోనూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించొచ్చు. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ మే 12న లాంఛనంగా దరఖాస్తు చేసుకుంది. స్విట్జర్లాండ్ అధ్యక్షుడితో చర్చల్లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం అంశాన్నీ మోదీ ప్రస్తావించే అవకాశముంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ.. ముందుగా అఫ్గనిస్థాన్కు వెళ్తారు. శనివారం అఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో కలిసి అఫ్గన్ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్(సల్మా డ్యామ్)ను ప్రారంభిస్తారు. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితితో పాటు పలు అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ డ్యామ్ అఫ్గన్భారత్ స్నేహానికి చిహ్నమని.. ఇది హెరత్లోని పంట పొలాలకు జీవం అందించటంతో పాటు ఆ ప్రాంత ప్రజలకు సౌభాగ్యాన్ని కలిగిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. అక్కడ్నుంచి ప్రధాని మోదీ చమురు సమృద్ధ దేశం ఖతార్కు వెళ్తారు. ఆ దేశ ప్రధానమంత్రి, ఇతర నేతలతో చర్చలు జరుపుతారు. రెండు దేశాల ప్రజల మధ్య బలంగా నాటుకున్న చరిత్రాత్మక స్నేహాన్ని తన పర్యటన పరిపుష్టం చేయగలదని మోదీ ఆకాక్షించారు. ఆయన అక్కడ్నుంచి ఆదివారం నాడు రెండు రోజుల పర్యటన కోసం స్విట్జర్లాండ్కు బయలుదేరతారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవటానికి తాను స్విస్ అధ్యక్షుడు ష్నీదర్అమ్మన్తో చర్చలు జరుపుతానని మోదీ తెలిపారు. అక్కడి ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు సెర్న్లో భారతీయ శాస్త్రవేత్తలనూ కలుసుకుంటానని వెల్లడించారు. స్విట్జర్లాండ్ నుంచి మోదీ జూన్ 6న వాషింగ్టన్కు వెళ్తారు. అధ్యక్షుడు ఒబామా కోరిక మేరకు అమెరికాలో పర్యటించనున్న మోదీ.. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలోనూ ప్రసంగిస్తారు. ఇలాంటి అవకాశం దక్కినవారిలో మోదీ ఐదో భారతీయ ప్రధానమంత్రి. ఆర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీలో నివాళుల అర్పించటంతో మోదీ అమెరికా పర్యటన ఆరంభమవుతుంది. అనంతరం ఆ దేశ మేధావులతో భేటీ అవుతారు. యూఎస్ఐబీసీ 40వ వార్షిక సమావేశంలోనూ ప్రసంగిస్తారు. జూన్ 7న అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ కానున్నారు. వివిధ రంగాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవటంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. మోదీ అమెరికా నుంచి జూన్ 8న మెక్సికోకు చేరుకుంటారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలు, ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మద్దతు కోరటం వంటి పలు అంశాలపై మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటోతో చర్చలు జరుపుతారు. 1986లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తర్వాత జరుగుతున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జీ20 సదస్సులో పాల్గొనటానికి మెక్సికోను సందర్శించారు. ప్రధానమంత్రి మోదీ జూన్ 8న సాయంత్రం తిరిగి భారత్కు బయలుదేరతారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









