త్వరలో పార్శిళ్లు ఇంటి వద్దనే పికప్, డెలివరీ: టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్

- March 15, 2024 , by Maagulf
త్వరలో పార్శిళ్లు ఇంటి వద్దనే పికప్, డెలివరీ: టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్

హైదరాబాద్: ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్‌ విభాగ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌  దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్‌ మోడల్‌ కౌంటర్‌ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ ప్రారంభించారు. కొత్త కౌంటర్‌ లో ఒక పార్శిల్‌ ను బుకింగ్‌ చేసి రశీదును వినియోగదారుడు శివ కుమార్‌కు ఆయన అందజేశారు. అనంతరం లాజిస్టిక్స్ విభాగ కొత్త లోగో, బ్రోచర్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పార్శిళ్ల హోం పికప్‌, డెలివరీ కోసం వినియోగించే కొత్త వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ మాట్లాడుతూ.. టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం తెలంగాణలో అతివేగంగా పార్శిళ్లను డెలివరీ చేసే వ్యవస్థ అని అన్నారు. ప్రతి రోజు సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శిళ్లను టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశామని పేర్కొన్నారు. ఆ పార్శిళ్ల రవాణా వల్ల టీఎస్‌ఆర్టీసీకి సుమారు రూ.120 కోట్ల రెవెన్యూ వచ్చిందని వెల్లడించారు.

"సంస్థకు టికెట్ ఆదాయం 97 శాతం వస్తుండగా.. టికెటేతర ఆదాయం 3 శాతమే వస్తోంది. ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించిన సంస్థ.. ప్రైవేట్‌ మార్కెట్‌కు ధీటుగా లాజిస్టిక్స్‌ విభాగాన్ని బలోపేతం చేస్తోంది. అందులోభాగంగానే దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో మోడల్‌ కౌంటర్‌ను ప్రారంభించాం. త్వరలోనే ఇలాంటి కౌంటర్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నాం. లాజిస్టిక్స్‌ విభాగ విస్తరణతో పాటు పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటు, జీవా వాటర్‌ బాటిల్‌ను అందుబాటులోకి తీసుకురావడం, బస్‌ స్టేషన్‌లలో స్టాళ్లలను యాజమాన్యం నిర్మిస్తోంది." అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు అన్నారు. ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో పార్శిళ్ల హోం పికప్, డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.

లాజిస్టిక్స్‌ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040-69440069 గానీ, https://www.tsrtclogistics.inవెబ్‌సైట్‌ను గానీ సంప్రదించవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, సీటీఎం(కమర్షియల్‌) శ్రీధర్‌, హైదరాబాద్ ఆర్ఎం వరప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం (లాజిస్టిక్స్) సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com