అయిదు జాతీయ పురస్కారాలను అందుకున్న టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌

- March 16, 2024 , by Maagulf
అయిదు జాతీయ పురస్కారాలను అందుకున్న టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌

న్యూ ఢిల్లీ: నేషనల్‌ పబ్లిక్‌ బస్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మకమైన అయిదు ఎక్స్‌లెన్స్‌ అవార్డులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) గెలుచుకున్న విషయం తెలిసిందే. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి.

న్యూఢిల్లీలోని ఇండియా హబిటెట్‌ సెంటర్‌ లో శుక్రవారం సాయంత్రం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఏఎస్‌ఆర్‌టీయూ అధ్యక్షులు, కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎస్‌ఆర్టీసీ గెలుపొందిన అయిదు నేషనల్‌ పబ్లిక్‌ బస్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ నేతృత్వంలోని ఆర్టీసీ అధికారుల బృందానికి ఆయన అందజేశారు.

రహదారి భద్రతలో ప్రథమ, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్‌ విభాగంలో ప్రథమ, అర్బన్‌ విభాగంలో ద్వితీయ, సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు గాను మరో ప్రథమ పురస్కారాన్ని టీఎస్‌ఆర్టీసీ అధికారుల బృందానికి అందజేశారు. 

ప్రతిష్టాత్మకమైన అయిదు జాతీయ స్థాయి అవార్డులు దక్కడం సంస్థకు ఎంతో గర్వకారణమని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ అన్నారు. ఈ పురస్కారాలతో టీఎస్‌ఆర్టీసీ ఖ్యాతి మరింతగా ఇనుమడించిందని ఆయన చెప్పారు. సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు వరించాయని పేర్కొన్నారు. అవార్డులు వచ్చేలా కృషిచేసిన 43 వేల టీఎస్ఆర్టీసీ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలను అంకితం చేస్తున్నట్లు సజ్జనర్‌ ప్రకటించారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ అదనపు కార్యదర్శి మహమూద్‌ అహ్మద్‌, ఏఎస్‌ఆర్టీయూ వైస్‌ ప్రెసిడెంట్ ద్వారక తిరుమల రావు, డైరెక్టర్‌ కిషోర్‌, ఈడీ సూర్య కిరణ్‌ గారు, టీఎస్‌ఆర్టీసీ సీఎంఈ రఘునాథరావు, డిప్యూటీ సీపీఎం(అడ్మిన్‌) శిరీష, డిప్యూటీ సీటీఎం(ఐటీ) సమీరా అఫ్రీన్‌, ఆదిలాబాద్‌ డిప్యూటీ ఆర్ఎం ఎస్‌.ప్రణీత్‌, నల్లగొండ డిప్యూటీ ఆర్‌ఎం శివ శంకర్‌, కొత్తగూడెం డీఎం బీవీ రావు, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com