గల్ఫ్ లో ఉద్యోగ అవకాశాల పై శ్రీలంక లో చర్చ

- June 30, 2015 , by Maagulf
గల్ఫ్ లో ఉద్యోగ అవకాశాల పై శ్రీలంక లో చర్చ

శ్రీలంక రాజధాని కొలంబోలో గల్ఫ్ ఉద్యోగాల నియామక ప్రక్రియలపై రెండు రోజుల పాటు జూన్ 29 మరియు 30 తేదీలలో ఆసియా ఉప ప్రాంతీయ స్థాయి సంప్రదింపుల సమావేశం జరిగింది. అమెరికన్ సాలిడారిటీ సెంటర్ మరియు మైగ్రెంట్ ఫోరం ఇన్ ఆసియా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకు భారత్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మాల్దీవులు, యు ఏ ఇ (షార్జా, దుబాయ్) లకు చెందిన ప్రభుత్వ అధికారులు, కార్మిక సంఘాలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

భారత్ నుండి ప్రవాసి కార్మిక నాయకులు మంద భీంరెడ్డి, సిస్టర్ లిజీ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విదేశీ రిక్రూటింగ్ ఏజెన్సీ జనరల్ మేనేజర్ డా.కె.వెంకటస్వామి, ప్రైవేటు రిక్రూటర్ దుర్గా ప్రసాద్, తమిళనాడుకు చెందిన హూబర్ట్ సన్, డిల్లీ కి చెందిన ఐ ఎల్ ఓ ప్రతినిది సీతా శర్మ, కేంద్ర హొమ్ శాఖ అధికారి ఫిలిప్, మాజీ రాజ్య సభ సభ్యులు రామచందర్ కుంతియా లు పాల్గొన్నారు. 

 

గల్ఫ్ ఉద్యోగాల రిక్రూటింగ్ లో కార్మికుల వలసలు, మానవ అక్రమ రవాణాకు అంతర్గతంగా ఉన్న సంబందాల గురించి చర్చ జరిగింది. గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపే దేశాలన్నీ ఒకే విధానాన్ని అనుసరించాలని, ఎలాంటి చార్జీలు లేకుండా, ఉచితంగా కార్మికులను గల్ఫ్ దేశాలకు పంపడానికి తీసుకోవలసిన చర్యలపై సమావేశం చర్చింది. రిక్ర్రూటింగ్ కు అయ్యే వ్యయాన్ని కంపెనీ యాజమాన్యాలే భరించాలని కోరారు. వివిధ దేశాలలో అమలులో ఉన్న రిక్రూటింగ్ పద్దతుల పై ఆయా దేశాల ప్రతినిధులు వివరించారు. భారత్ లో   ఇటీవల ప్రవేశపెట్టిన ఇ-మైగ్రేట్ ఆన్ లైన్ విధానంపై ఇతర దేశాల ప్రతినిధులు ఆసక్తి కనపరిచారు. కార్మికుల నైపుణ్య అభివృద్ధి, సంక్షేమం పై కార్మికులను పంపే దేశాలు దృష్టి సారించాలని సమావేశం కోరింది. కార్మికులను పంపే దేశాలు, కార్మికులను తీసుకునే దేశాలు ప్రభుత్వాల స్థాయిలో రిక్రూటింగ్ ను చేపట్టాలని సమావేశం సూచించింది. రిక్రూటింగ్ వ్యాపారంలో నైతికత, ప్రవర్తన నియమావళి ఉండాలని కోరారు. 

 

"మా గల్ఫ్" ప్రతినిది, హైదరాబాద్ 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com