రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

- June 24, 2024 , by Maagulf
రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ: ఏపీ గనులు–భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సెక్రటేరియట్ మూడో బ్లాక్‌ లో ఆయన తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి తన సతీమణి కొల్లు నీలిమసహా కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గనుల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్, గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ శాఖ అధికారులు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. చంద్రబాబు పవన్ కల్యాణ్, లోకేష్, బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. కీలక శాఖలకు తనకు అవకాశం ఇచ్చారని, తన పదవిని బాధ్యతగా భావిస్తున్నానన్నారు. గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని, ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీరం చేశారని మండిపడ్డారు.

అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.ఈ రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గతంలో ఇసుకలో భారీగా అక్రమాలు జరిగాయని, జగన్ మద్యపాన నిషేదం అని చెప్పి మద్యాన్ని తాకట్టు పెట్టి రూ. 30 వేల కోట్లు అప్పులు తెచ్చారని ఆరోపించారు. నిషేధం అన్నప్పుడు అప్పులు ఎలా తెచ్చారో చెప్పాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు… ఎక్కడికక్కడ ఏజెంట్‌లను పెట్టుకొని దోపిడీ చేయడంపై తన క్యాబినెట్‌లో చర్చిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com